హైదరాబాద్, వెలుగు : వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. ఐక్యరాజ్యసమితి ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) రోమ్లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ ‘డిజిటల్ అగ్రి ట్రాన్స్ఫర్మేషన్’ మోడల్ను ప్రత్యేకంగా ప్రదర్శించారు. సదస్సులో పాల్గొన్న వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ రాష్ట్రంలో అమలవుతున్న ఏఐ ఆధారిత వ్యవసాయ విధానాలను వివరించారు.
రైతులకు డిజిటల్ గుర్తింపు కార్డులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చీడపీడల గుర్తింపు, కచ్చితమైన సాగు విధానాలు, డ్రోన్లతో పురుగుమందుల పిచికారీ వంటి అంశాలను ఆయన వివరించారు. ఈ ఆధునిక విధానాలు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, దిగుబడులు పెరగడంతో పాటు సాగు ఖర్చులు కూడా తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మోడల్ను ఐఐఐటీ హైదరాబాద్తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అగ్రి మోడల్ను యునైటెడ్ నేషన్స్ ప్రతినిధులు, వివిధ దేశాల వ్యవసాయ నిపుణులు ప్రశంసించారు. ఈ మోడల్ ఇతర దేశాలకు కూడా దిక్సూచిలా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.
