పర్మినెంట్​ చేయాలి...వర్సిటీల్లో కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ల నిరసన

పర్మినెంట్​ చేయాలి...వర్సిటీల్లో కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్ల నిరసన

మహబూబ్​నగర్, వెలుగు : వర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ప్రొఫెసర్లు ఆందోళనకు దిగారు. 2008-–09 నుంచి డ్యూటీలు చేస్తున్నా, తమను రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్​సర్కారు 2016లో జీవో 16 ప్రకారం పర్మినెంట్​ చేస్తామని హామీ ఇచ్చిందని, ఏడేండ్లు కావొస్తున్నా రెగ్యులరైజ్​ చేయడం లేదని నిరసన తెలుపుతున్నారు. 

రోజూ గంట పాటు నిరసన

2008--–09 నుంచి రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల్లో కలిపి సుమారు1,500 మంది వరకు కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్లు పని చేస్తున్నారు. ఇందులో కొందరు చనిపోగా, మరో వంద మంది వరకు రిటైర్ అయ్యారు. ప్రస్తుతం 1,335 మంది డ్యూటీలు చేస్తున్నారు. వీరిలో ఉస్మానియా యూనివర్సిటీలో 370 మంది, కాకతీయ యూనివర్సిటీ182, జేఎన్​టీయూలో 265, తెలంగాణ వర్సిటీలో 52, మహాత్మాగాంధీ వర్సిటీలో 49, పాలమూరులో 100, శాతవాహనలో 39, తెలుగు యూనివర్సిటీలో 22, జేఎన్​ఎఫ్​ఏయూలో 99, అంబేద్కర్​ వర్సిటీలో 22, రాజీవ్​ గాంధీ వర్సిటీలో 136 మంది  పని చేస్తున్నారు.  వీరంతా తమను పర్మినెంట్​ చేయాలని 21 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ మధ్యాహ్నం లంచ్​ బ్రేక్​ టైంలో గంట పాటు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే మంత్రులు హరీశ్​​రావు, సబితా ఇంద్రారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్​కుమార్​ను కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. తమ సమస్యను సీఎం కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

పీఆర్సీ అమలు చేయట్లే..

వర్సిటీల్లో కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్లకు సర్వీసు ఆధారంగా రూ.34 వేల నుంచి రూ.45 వేల వరకు వేతనాలు ఇస్తున్నారు. కానీ, రాష్ర్ట ప్రభుత్వం వీరికి పీఆర్సీని ఇంప్లిమెంట్​ చేయడం లేదు. హయ్యర్​ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్​లో కాంట్రాక్ట్​ బేసిక్​ కింద వర్క్​ చేస్తున్న జూనియర్​  లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, పాలిటెక్నిక్​ లెక్చరర్లు, గురుకులాల్లో పని చేస్తున్న వారికి 30 శాతం పీఆర్సీని వర్తింపజేస్తున్నా.. వీరిపై వివక్ష చూపుతున్నారు. దీంతో ఏండ్లు కావొస్తున్నా.. ఇంక్రిమెంట్లు పడడం లేదు.

జీవో 16 ప్రకారం రెగ్యులరైజ్ ​చేయండి 

కొద్ది రోజుల కింద రాష్ర్ట ప్రభుత్వం హయ్యర్​ఎడ్యుకేషన్​ డిపార్ట్​మెంట్ ​పరిధిలో కాంట్రాక్ట్​ బేసిక్​ కింద పని చేస్తున్న దాదాపు నాలుగు వేల మందిని జీవో 16 ప్రకారం రెగ్యులరైజ్​ చేసింది. ఇందులో జూనియర్​ లెక్చరర్లు మూడు వేల మంది, డిగ్రీ కాలేజ్​ లెక్చరర్లు 270 మంది, పాలిటెక్నిక్​ లెక్చరర్లు 400 మంది ఉన్నారు. వీరితో పాటు మెడికల్ ​అండ్ ​హెల్త్ ​ డిపార్ట్​మెంట్​లో మరో వెయ్యి మందిని ఇదే జీవో ఆధారంగా రెగ్యులరైజ్​ చేసింది. అయితే, తమను కూడా జీవో 16 ప్రకారం పర్మినెంట్​ చేయాలని వర్సిటీ కాంట్రాక్టర్​ అసిస్టెంట్​ ప్రొఫెసర్లు డిమాండ్​ చేస్తున్నారు. 15 ఏండ్లుగా తాము డ్యూటీలు చేస్తున్నామని, కొందరైతే రిటైర్మెంట్​కు దగ్గరయ్యారని చెప్తున్నారు. తమను రెగ్యులరైజ్​ చేయకపోతే ఉద్యమాలకు కార్యాచరణ రూపొందిస్తామని స్పష్టం చేస్తున్నారు.

నా దగ్గర చదువుకున్న వారికి పర్మినెంట్ ​అయ్యింది 

2008లో కొత్త యూనివర్సిటీలు వచ్చాయి. 2009లో నేను పాలమూరు యూనివర్సిటీలో ఇంటర్వ్యూ ద్వారా కాంట్రాక్ట్​ జాబ్​కు సెలెక్ట్​ అయ్యా. అసిస్టెంట్​ ప్రొఫెసర్​గా, వార్డెన్​గా, కో ఆర్డినేటర్​గా జాబ్ చేస్తున్నా. నేను చదువు చెప్పిన స్టూడెంట్లు ఇప్పుడు జేఎల్, డీఎల్​లుగా రెగ్యులర్ అయ్యారు. నేను కాలేదు. 
- వంగరి భూమయ్య, పీయూ టీచర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​

15 ఏండ్లుగా పని చేస్తున్నా..

2008 నుంచి నేను యూనివర్సిటీలో కాంట్రాక్ట్​ పద్ధతిలో పని చేస్తున్నా. తెలంగాణ వస్తే మమ్మల్ని రెగ్యులరైజ్​ చేస్తారని అనుకున్నాం.  తొమ్మిదేండ్లు అయినా చేయలేదు. మేం డ్యూటీల్లో చేరి 15 ఏండ్లు అవుతోంది. ఎదురుచూపులు తప్పట్లేదు

 - రవికాంత్​, కాంట్రాక్ట్​ అసిస్టెంట్​ప్రొఫెసర్, పాలమూరు యూనివర్సిటీ