5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. సంచలన నిర్ణయం

5 ఏళ్ల ట్రాఫిక్ చలాన్లు రద్దు.. సంచలన నిర్ణయం

ఉత్తర్​ప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వాహనదారులకు తీపి కబురు అందించింది. ఆ రాష్ట్రంలోని అన్ని వాహనాలపై ట్రాఫిక్ చలాన్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  దీంతో లక్షల మంది వాహనదారులకు ఊరట లభించింది. ఇందుకు సంబంధించిన జీవోను గవర్నమెంట్ విడుదల చేసింది. వాహనదారులు వెబ్‌సైట్‌లోని వెహికిల్​ నంబర్ ఆధారంగా వివరాలను సరిచూసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

అన్ని రకాల ప్రైవేట్, వాణిజ్య వాహనాలపై  జనవరి 1, 2017 నుంచి డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న అన్ని రకాల చలాన్లను రద్దు చేస్తున్నామన్నారు. వీటి రద్దు తరువాత వెహికిల్​ ఓనర్ల ఫోన్లకు మెసేజ్​ వస్తుందని చెప్పారు. చలాన్లు నమోదు చేసి కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న వాహనాలకు కూడా ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని పేర్కొన్నారు.  ప్రభుత్వ నిర్ణయంపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  కాగా చలాన్లను రద్దు చేయాలని ఇటీవల నోయిడాకి చెందిన పలువురు రైతులు రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసిన కొన్నాళ్లకే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

పోర్టల్​లో ఫిర్యాదు చేయవచ్చు..

అన్ని ప్రాంతీయ రవాణా అధికారులు, ప్రభుత్వ ఉత్తర్వులు అమలు చేయాలని రాష్ట్ర రవాణా కమిషనర్ చంద్ర భూషణ్ సింగ్ ఆదేశించారు. కోర్టు కేసుల జాబితాను ఇచ్చిన తర్వాత.. పోర్టల్ నుంచి అన్ని చలాన్లను తొలగించాలని సూచించారు.ఇంట్లోనే ఆన్ లైన్ లో దరఖాస్తు నింపి సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ట్రాఫిక్ పోలీసుల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఏదైనా వాహనంపై తప్పుడు చలాన్లు ఉన్నట్లు గుర్తిస్తే, వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.