జీడిమెట్ల, వెలుగు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం షాపూర్నగర్లో రోడ్ షో జరిగింది. ముఖ్య అతిథిగా యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ హాజరై మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మారుస్తామని, తెలంగాణకు కేంద్ర బిందువుగా చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నివర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.
ఈనెల 30న జరిగే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శ్రీశైలంగౌడ్ గుర్తు కమలంపై ఓటు వేసి గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్ మాట్లాడుతూ.. గెలిపిస్తే.. నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా రౌడీకావాలా? లేదా ప్రజలకు సేవచేసే వ్యక్తి కావాలో ఆలోచించాలని ఆయన ఓటర్లను కోరారు. ఈ రోడ్షోలో ఎంపీ లక్ష్మణ్, పార్టీ నేతలు, పెద్ద సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.