
జౌన్పూర్: భార్య మృత దేహానికి అంత్యక్రియలు జరపడానికి ఓ వ్యక్తి గంటలపాటు సైకిల్ పై తీసుకెళ్లడం అందరి హృదయాల్ని కలచివేస్తోంది. ఉత్తర్ ప్రదేశ్లోని జౌన్పూర్లో ఈ ఘటన జరిగింది. తిలక్ధారీ సింగ్ అనే వృద్ధుడి భార్య రాజ్కుమారి (50) అనారోగ్యంతో ఉమానాథ్ సింగ్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ ఆరోగ్యం విషమించడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అంత్యక్రియల కోసం తిలక్ధారీ తన భార్య మృత దేహాన్ని సైకిల్ మీద వేసుకొని గంటలపాటు తొక్కుకుంటూ వెళ్లాడు. ఎట్టకేలకు ఓ చోట అంత్యక్రియలు చేద్దామనుకోగా.. అందుకు స్థానిక గ్రామస్థులు కరోనా భయంతో అడ్డుకున్నారు. దీంతో తిలక్ధారీ ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేయించారు. ఇలాంటి మరో ఘటన ఆంధ్రప్రదేశ్లోనూ జరిగింది.
తల్లి శవాన్ని 18 కి.మీ.లు బైక్పై తీసుకెళ్లిన కొడుకు
శ్రీకాకుళం జిల్లాకు చెందిన నరేంద్ర అనే వ్యక్తి తల్లి అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో డాక్టర్ వద్దకు తీసుకెళ్లగా సీటీ స్కాన్ చేయించాల్సిందిగా సూచించారు. దీంతో ఆమెను పలాసలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్కు నరేంద్ర తీసుకెళ్లాడు. అయితే సీటీ స్కాన్ రిపోర్టు కోసం ఎదురూ చూస్తుండగా ఆమె ఆరోగ్యం మరింతగా క్షీణించి ప్రాణాలు వదిలింది. డెడ్బాడీని ఇంటికి తీసుకెళ్దామని యత్నించగా.. దగ్గర్లో అంబులెన్స్, ఆటోరిక్షాలు ఏవీ కనిపించలేదు. దీంతో నరేందర్ తన బంధువులకు విషయం చెప్పాడు. వెంటనే వచ్చిన రిలేటివ్స్.. శవాన్ని బైక్ మీదే దాదాపు 18 కిలోమీటర్లు తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.