దుబాయ్‌లో UPI సేవలు.. ప్రారంభించిన మోడీ, యూఏఈ అధ్యక్షుడు

దుబాయ్‌లో UPI సేవలు.. ప్రారంభించిన మోడీ, యూఏఈ అధ్యక్షుడు

గల్ఫ్ దేశం యూఏఈలో యూపిఐ(UPI), రూపే కార్డ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మంగళవారం(ఫిబ్రవరి 13) భారత ప్రధాని నరేంద్ర మోడీ, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ సంయుక్తంగా యూఏఈలో సేవలను ప్రారంభించారు. రూపే అనేది భారత ఆర్థిక సేవలు మరియు చెల్లింపు సేవా వ్యవస్థ. ఇక యూపిఐ అంటే తక్షణ చెల్లింపు వ్యవస్థ. అనగా.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం ద్వారా చేసే చెల్లింపులు అన్నమాట.

యూపిఐ(UPI), రూపే కార్డ్ సేవలు ప్రారంభించే ముందు, ప్రధాని మోడీ, యూఏఈ అధ్యక్షుడు మహమ్మద్ బిన్ జాయెద్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ ద్వైపాక్షిక చర్చల్లో అనేక ఒప్పందాలు(MOUలు) జరిగాయి. ఈ సమావేశంలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా పాల్గొన్నారు. అంతకుముందు, విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని మోదీకి.. మహమ్మద్ బిన్ జాయెద్ ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు కరచాలనం చేసుకొని ఒకరినొకరు కౌగిలించుకున్నారు.

కాసేపట్లో అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. రేపు అబుదాబిలో BAPS హిందూ దేవాలయాన్ని ఆయన ప్రారంభించనున్నారు. అబుదాబిలో నిర్మించిన మొదటి హిందూ దేవాలయం ఇదే.

Also Read:దేశ వ్యాప్తంగా ఉచిత కరెంట్ స్కీం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..