- యూపీఐ ట్రాన్సాక్షన్లు ఫ్రీనే
- వాలెట్ల నుంచి మర్చంట్లకు చేసే ట్రాన్సాక్షన్లపైనే ఇంటర్చేంజ్ ఫీ
న్యూఢిల్లీ: చివరికి యూపీఐ ట్రన్సాక్షన్లపైన కూడా ప్రభుత్వం ట్యాక్స్ వేస్తోందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. 99.9 శాతం ట్రాన్సాక్షన్లపై ఎటువంటి సర్ఛార్జ్ పడదని పేర్కొంది. పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే వంటి ప్లాట్ఫామ్స్ నుంచి డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్ ద్వారా చేసే ట్రాన్సాక్షన్లపై ఎటువంటి ఛార్జీలు పడవని ఓ స్టేట్మెంట్లో వివరించింది. ఫ్రీగా, వేగవంతమైన, సురక్షితమైన ఎక్స్పీరియెన్స్ను అందిస్తూ డిజిటల్ పేమెంట్స్కు అనువైన ప్లాట్ఫామ్గా యూపీఐ నిలిచిందని, యూపీఐ ట్రాన్సాక్షన్లలో 99.9 శాతం బ్యాంక్ అకౌంట్ నుంచి డైరెక్ట్గా జరిగేవే ఉన్నాయని వెల్లడించింది. ఇలా అకౌంట్ నుంచి అకౌంట్కు జరిగే ట్రాన్సాక్షన్లు కస్టమర్లకు, మర్చంట్లకు ఫ్రీ అని పేర్కొంది. ఎన్పీసీఐ షేర్ చేసిన ప్రెస్ నోట్ను పేటీఎం రీట్వీట్ చేసింది. పేటీఎం యూపీఐ ఫ్రీ. వేగవంతమైనది, సురక్షితమైనది, ఎటువంటి అంతరాయం ఉండదని పేర్కొంది. బ్యాంక్ అకౌంట్ నుంచి లేదా పీపీఐ/పేటీఎం వాలెట్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్ చేసిన ఏ కస్టమర్ కూడా ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని వివరించింది.
పీపీఐ అంటే ?
ప్రీ పెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రుమెంట్ (పీపీఐ) డిజిటల్ వాలెట్స్గా పనిచేస్తాయి. వీటిలో మనీని యాడ్ చేసుకొని, వేరు వేరు ట్రాన్సాక్షన్లకు వాడుకోవచ్చు. అమెజాన్ పే, పేటీఎం, ఫోన్పే వంటివి డిజిటల్ వాలెట్స్ను అందిస్తున్నాయి. కస్టమర్ ఈ వాలెట్లలో డబ్బులు యాడ్ చేసుకుంటే, ఆ మనీ బ్యాంక్ అకౌంట్లో స్టోర్ అవ్వదు. బదులుగా పేమెంట్ కంపెనీ దగ్గర స్టోర్ అవుతుంది. పేమెంట్ చేసేటప్పుడు వాలెట్లోని మనీ కట్ అవుతుంది. బ్యాంక్ నుంచి కాదు.
ఎన్పీసీఐ నోటీస్ ఏం చెబుతుందంటే?
ఎన్పీసీఐ మంగళవారం విడుదల చేసిన నోటిస్ ప్రకారం, పీపీఐ వాలెట్ల నుంచి రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ట్రాన్సాక్షన్లు యూపీఐ ద్వారా మర్చంట్కు జరిగితే ట్రాన్సాక్షన్ వాల్యూలో 1.1 శాతం వరకు ఇంటర్చేంజ్ ఫీజు పడుతుంది. ఈ రూల్ ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. పెట్రోల్ బంకులు వంటి కొన్ని యూపీఐ పేమెంట్స్పై 0.5% వరకు ఇంటర్చేంజ్ ఫీజు వేస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 న ఈ రేట్లపై మరోసారి రివ్యూ చేస్తామని ఎన్పీసీఐ ప్రకటించింది. ఈ ఛార్జీ కూడా మర్చంట్లపై పడుతుందని వెల్లడించింది. కాగా, పీపీఐ వాలెట్లను ఇష్యూ చేసే కంపెనీలు వాలెట్ లోడింగ్ ఛార్జీ కింద బ్యాంకులకు 0.15 శాతం ఫీజును చెల్లించాల్సి
ఉంటుంది.
రూ. 2 లక్షల కోట్లకు వాలెట్ ట్రాన్సాక్షన్లు..
కిందటేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య వాలెట్ల ద్వారా రూ.2 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు జరిగాయని, వాలెట్ ఇష్యూయర్లు బ్యాంకులకు వాలెట్ లోడింగ్ ఛార్జీల కింద రూ.100 కోట్ల వరకు చెల్లించాయని సిటీ రీసెర్చ్ ఓ నోట్లో పేర్కొంది. ఈ ట్రాన్సాక్షన్లలో 60 శాతం యూపీఐ ద్వారా జరిగాయని అంచనావేసి ఈ లెక్కలు వేసింది. వాలెట్లలో పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ టాప్లో ఉంది. ఈ కంపెనీకి 10 కోట్ల మందికి పైగా వాలెట్ యూజర్లు ఉన్నారు.
ఇంటర్చేంజ్ ఫీ అంటే?
పీపీఐల నుంచి పేమెంట్స్ చేసేటప్పుడు ఆ పేమెంట్లను అంగీకరించడానికి, ప్రాసెస్ చేయడానికి, ట్రాన్సాక్షన్ను ఆథరైజ్ చేయడానికి ఇంటర్చేంజ్ ఫీజు కింద కొంత సుంకాన్ని వేయనున్నారు. మర్చంట్ల టైప్ బట్టి ఇంటర్చేంజ్ ఫీజులో తేడా ఉంటుంది. అగ్రికల్చర్, టెలికం సెక్టార్లోని మర్చంట్లకు తక్కువ ఇంటర్చేంజ్ ఫీజు పడుతుంది.