రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి..యూరియా యాప్‌‌‌‌ సమస్యలు అదే రోజు పరిష్కరించాలి : మంత్రి తుమ్మల

రైతు ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయాలి..యూరియా యాప్‌‌‌‌ సమస్యలు అదే రోజు పరిష్కరించాలి : మంత్రి తుమ్మల
  • నేరుగా ఖాతాల్లోకి యాంత్రీకరణ సబ్సిడీ 

హైదరాబాద్, వెలుగు : రైతులకు పెట్టుబడి భారం తగ్గించడం, ఎరువుల సరఫరాలో ఇబ్బందులు లేకుండా ఆఫీసర్లు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో అగ్రికల్చర్, కోఆపరేటివ్​శాఖల పరిధిలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫామ్​మెకనైజేషన్​ స్కీం కింద రైతులకు ఇచ్చే పనిముట్లను ఖరారు చేసినట్లు చెప్పారు. రైతుల అవసరాలకు అనుగుణంగా పనిముట్లను ఎంపిక చేసి, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. పథకం కింద అందించే సబ్సిడీని నేరుగా రైతుల అకౌంట్లలో జమ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

పనిముట్లు సరఫరా చేసే సంస్థల ఎంప్యానెల్‌‌‌‌మెంట్‌‌‌‌ లిస్ట్ హాకా అధికారులు పరిశీలిస్తున్న నేపథ్యంలో నాణ్యత, ధర, రైతులకు అందుబాటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని లిస్ట్ ను ఖరారు చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో యూరియా సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఫర్టిలైజర్‌‌‌‌ యాప్‌‌‌‌లో మ్యాపింగ్‌‌‌‌ కారణంగా సమస్యలు తలెత్తితే కలెక్టర్లు, అగ్రికల్చర్​ఆఫీసర్లు వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, కేంద్ర అధికారులతో మాట్లాడి అదే రోజున సమస్యను పరిష్కారం అ్యయేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

రాష్ట్రానికి అవసరమైన ఎరువుల కోసం కేంద్రంతో నిరంతరం సమన్వయం చేస్తున్నామని చెప్పారు. ఆయిల్‌‌‌‌పామ్‌‌‌‌ సాగు విస్తరణకు మరింత పెంచాలని సూచించారు. నర్సరీల్లో టార్గెట్​కు రెట్టింపు సంఖ్యలో మొక్కలను సిద్ధం చేయాలని ఆదేశించారు. 

రాష్ట్రవ్యాప్తంగా 2,600 రైతు వేదికలపై సోలార్‌‌‌‌ ప్యానెల్స్‌‌‌‌ ఏర్పాటు చేయాలని సూచించారు. సమీక్షలో అగ్రికల్చర్​ సెక్రటరీ సురేంద్ర మోహన్, డైరెక్టర్ గోపి, కోఆపరేషన్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ రాహుల్‌‌‌‌ రాజ్, హార్టికల్చర్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ యాస్మిన్‌‌‌‌ భాషా, హాకా ఎండీ చంద్రశేఖర్‌‌‌‌రెడ్డి పాల్గొన్నారు.