ఆకట్టుకుంటున్న హార్టికల్చర్‌ షో..టెర్రస్‌ గార్డెనింగ్‌పై అర్బన్‌ జనాల ఆసక్తి

ఆకట్టుకుంటున్న హార్టికల్చర్‌ షో..టెర్రస్‌ గార్డెనింగ్‌పై అర్బన్‌ జనాల ఆసక్తి

హైదరాబాద్, వెలుగు: కాంక్రీట్‌ జంగిల్‌గా మారిన నగరంలో పచ్చదనం పెంచుకోవాలనే ఆసక్తి జనాల్లో పెరుగుతోంది. ఇంటి ఆవరణలో మొక్కలు, బాల్కనీలో పూల మొక్కలు, మిద్దెపై తోట పెంచుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఐమ్యాక్స్‌ థియేటర్‌ వద్ద హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో జరుగుతున్న 20వ గ్రాండ్‌ నర్సరీ మేళా-ఆల్‌ ఇండియా హార్టీకల్చర్‌, అగ్రికల్చర్‌ షో సందర్శకులను ఆకట్టుకుంటోంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి అరుదైన, అలంకరణ, ఔషధ, పూల మొక్కలను ఇక్కడ అందుబాటులో ఉంచారు. 

ఈ నెల 31 వరకు జరిగే మేళాలో 140కి పైగా స్టాల్స్‌ ఏర్పాటు చేశారు. డార్జిలింగ్‌, కోల్‌కతా, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణే, చెన్నైతో పాటు తెలంగాణ, ఏపీ నుంచి మొక్కలు తెచ్చారు. పూలు, మెడిసినల్‌, బోన్సాయ్‌, అలంకరణ మొక్కలతో పాటు టెర్రస్‌, వెర్టికల్‌, హైడ్రోపోనిక్‌ గార్డెనింగ్‌కు అనువైన మొక్కలు ఉన్నాయి.