కరీంనగర్ రూరల్, వెలుగు: కరీంనగర్ రూరల్పోలీస్స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సమీపంలో హాష్ ఆయిల్, గంజాయి, డ్రగ్ ట్యాబ్లెట్లతో తిరుగుతున్న తొమ్మిది మంది యువకులను పోలీసులు అరెస్ట్చేశారు.
శుక్రవారం రూరల్ ఏసీపీ ఎ.విజయ్కుమార్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కరీంనగర్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల ప్రాంతాలకు చెందిన మొర్రి ఆకాశ్, పుట్టపాక విష్ణు సాయి, భైనవేని నితీశ్, కోసిని బాలచంద్ర్, గుండు మనోహర్, విస్కుమల్లి విశాల్, గుండు కృష్ణగిరి, సిరిసిల్ల ప్రభాస్, మాకుల శివప్రసాద్ ముఠాగా ఏర్పడ్డారు.
ఏపీలోని అల్లూరి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో హాష్ఆయిల్, గంజాయి కొని, రైలు మార్గంలో కరీంనగర్ తీసుకొచ్చి అమ్ముతున్నారు. దీంతోపాటు సిటీలోని డీమార్ట్ సమీపంలో ఓ మెడికల్షాపు నుంచి టపాల్50గా పేర్కొన్న డ్రగ్ట్యాబ్లెట్స్ కొని, సిరంజీల ద్వారా వినియోగిస్తున్నారు. శుక్రవారం బొమ్మకల్ నేచర్క్యూర్ హాస్పిటల్ సమీపంలో అరెస్ట్ చేశారు.
వీరి వయస్సు 20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉందని, వీరిలో కొంతమంది బీటెక్, డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. వీరిని అదుపులోకి తీసుకొని విచారించగా కరీంనగర్ జ్యోతినగర్లో ఓ గదిని అద్దెకు తీసుకుని ఈ దందా చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుల వద్ద సుమారు 500 మిల్లీలీటర్ల హాష్ ఆయిల్, 500 గ్రాముల గంజాయి, 60 డ్రగ్ ట్యాబ్లెట్లు, 14 సిరంజీలు, హాష్ ఆయిల్ వినియోగానికి ఉపయోగించే పరికరాలు, 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని ఏసీపీ వివరించారు.
డ్రగ్ ట్యాబ్లెట్లను అమ్మిన మెడికల్ షాప్ నిర్వాహకుడిపై కూడా కేసు నమోదు చేశామన్నారు. భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుని నిందితులను పట్టుకున్న సీఐ నిరంజన్రెడ్డి, ఎస్ఐ లక్ష్మారెడ్డి, సిబ్బందిని సీపీ గౌష్ఆలం, ఏసీపీ అభినందించారు.
