- ఫెంటానిల్పై టారిఫ్ 10% తగ్గిస్తున్నట్టు ట్రంప్ ప్రకటన
- బీజింగ్పై టారిఫ్లు 57% నుంచి 47 శాతానికి డౌన్
- రేర్ ఎర్త్ మెటీరియల్స్పై కుదిరిన అగ్రిమెంట్
- అమెరికాకు ఏడాదిపాటు ఎగుమతి చేసేలా చైనా ఓకే
- జిన్పింగ్పై ట్రంప్ ప్రశంసల వర్షం
న్యూయార్క్: దక్షిణ కొరియా వేదికగా అమెరికా–చైనా మధ్య టారిఫ్ డీల్ కుదిరింది. ఆ రెండు దేశాల మధ్య కొద్దిరోజులుగా సాగుతున్న వాణిజ్య ఉద్రిక్తతలకు తెరపడింది. గురువారం బుసాన్ నగరంలోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ సమీప గిమ్హే ఎయిర్బేస్లో అమెరికా ప్రెసిడెంట్డొనాల్డ్ ట్రంప్తో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ భేటీ అయ్యారు. దాదాపు ఆరేండ్ల తర్వాత పర్సనల్గా కలిసిన ఈ నేతలిద్దరూ 2 గంటల పాటు అంతర్గతంగా చర్చలు జరిపారు.
ఈ సమావేశం అనంతరం ట్రంప్ కీలక ప్రకటన చేశారు. చైనాపై టారిఫ్లను 10 శాతం మేర తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ‘‘జిన్పింగ్తో భేటీ అద్భుతంగా జరిగింది. ఈ మీటింగ్లో మేమిద్దరం చాలా విషయాలపై చర్చించాం. ఫెంటానిల్ తయారీలో వాడే ముడి ఉత్పత్తుల రవాణాను కట్టడి చేస్తానని జిన్పింగ్ హామీ ఇచ్చారు. అందుకే ఫెంటానిల్ పేరుతో చైనాపై విధించిన 20 శాతం టారిఫ్లను 10 శాతానికి తగ్గిస్తున్నా. బీజింగ్పై మొత్తం సుంకాలు 57శాతం నుంచి 47 శాతానికి తగ్గుతాయి” అని తెలిపారు. సోయాబీన్ ఉత్పత్తుల కొనుగోళ్ల పునరుద్ధరణకు కూడా డ్రాగన్
కంట్రీ అంగీకరించిందని ట్రంప్ వెల్లడించారు.
రేర్ ఎర్త్ మెటీరియల్స్ సమస్య పరిష్కారం
రేర్ ఎర్త్ మెటీరియల్కు సంబంధించిన సమస్య కూడా పరిష్కారమైందని ట్రంప్ వెల్లడించారు. ఈ మెటీరియల్స్ను ఏడాది పాటు ఎగుమతి చేసేలా చైనా అంగీకరించిందని, ఈమేరకు ఇరు దేశాల మధ్య అగ్రిమెంట్ కుదిరిందని చెప్పారు. ప్రతి ఏటా అగ్రిమెంట్ ముగిసిన వెంటనే చర్చలు జరుపుతామని వెల్లడించారు. ఇక చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం కూడా కుదురుతుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తంచేశారు.
ఈ సందర్భంగా జిన్పింగ్పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన శక్తిమంతమైన దేశానికి గొప్ప నాయకుడని అన్నారు. జిన్పింగ్కు 10కి 12 మార్కులు ఇస్తానని వెల్లడించారు. వచ్చే ఏడాది ఏప్రిల్లో తాను చైనాలో పర్యటిస్తానని తెలిపారు. ఆ తర్వాత జిన్పింగ్ కూడా అమెరికాకు వస్తారని చెప్పారు. ఫ్లోరిడా, పామ్ బీచ్ లోగానీ లేదా వాషింగ్టన్ డీసీలోగానీ తాము భేటీ అవుతామని ట్రంప్ చెప్పారు.
