వాషింగ్టన్: ఇరాన్పై ఏ క్షణంలోనైనా యుద్ధాన్ని ఉధృతం చేసేందుకు సిద్ధంగా అమెరికా దళాలు ఉన్నాయని ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ పీట్ హెగ్సెత్ వార్నింగ్ తెలిపారు. రాబోయే రోజులు అత్యంత కీలకమైన రోజులు అని పేర్కొన్నారు. అవసరమైతే ఇరాన్పై భూతల దాడులకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పర్యటించి అమెరికా దళాల సన్నద్ధతను సమీక్షించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాబోయే రోజులు యుద్ధ గమనాన్ని శాసిస్తాయి.
ఈ విషయం ఇరాన్కు కూడా తెలుసు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మమ్మల్ని సైనికపరంగా అడ్డుకునే శక్తి వారికి లేదు. మా బాంబు దాడులు ఇరాన్ సైన్యాన్ని కకావికలం చేశాయి. సోమవారం ఒక్కరోజే అమెరికా దళాలు 200 డైనమిక్ దాడులు నిర్వహించాయి. ఇరాన్ నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింది. శత్రువును అణచివేస్తాం” అని హెగ్సెత్ ధీమా వ్యక్తం చేశారు. తమ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వైఖరిని పీట్ సమర్థించారు.
ట్రంప్ మాటల మనిషి కాదని, చేతల మనిషి అని పేర్కొన్నారు. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదన్నదే తమ లక్ష్యం అని స్పష్టం చేశారు. వారు తెలివైన వారైతే వెంటనే ఒప్పందం చేసుకుంటరని అన్నారు. కాగా, చర్చల పేరుతో అమెరికా తమ దేశంపై దురాక్రమణకు ప్లాన్ చేస్తోందని టెహ్రాన్ ఆరోపించింది. అమెరికా దళాలు ఇరాన్ గడ్డపై అడుగుపెడితే అది వారికి నరకంగా మారుతుందని హెచ్చరించింది.
