మీరు మస్తు పాపులర్.. మోడీతో బైడెన్

మీరు మస్తు పాపులర్.. మోడీతో బైడెన్

న్యూఢిల్లీ: మన ప్రధాని నరేంద్ర మోడీకి ప్రపంచవ్యాప్తంగా మస్తు పాపులారిటీ ఉందని అమెరికా అధ్యక్షుడు బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ అన్నారు. తమ దేశాల్లో మోడీ పాల్గొననున్న కార్యక్రమాలకు హాజరయ్యేందుకు జనం పోటీ పడుతున్నారని, అది తమకు పెద్ద సమస్యగా మారిందని చెప్పారు. జపాన్ లోని టోక్యోలో క్వాడ్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా మోడీతో బైడెన్, అల్బనీస్ కొద్దిసేపు మాట్లాడారు. ఆ టైమ్ లో తాము ఎదుర్కొంటున్న సమస్యను మోడీకి చెప్పారు.

 ‘‘మీరు నాకు చాలా పెద్ద సమస్య తెచ్చి పెట్టారు. వచ్చే నెలలో వాషింగ్టన్ లో మేము మీకు డిన్నర్ ఇవ్వనున్నం. అయితే దానికి దేశంలోని అందరూ రావాలని అనుకుంటున్నారు. ఇదేం జోక్ కాదు.. కావాలంటే మా టీమ్ ను అడగండి. మిమ్మల్ని కలవడానికి అవకాశం కల్పించాలని నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. మీకు మస్తు పాపులారిటీ ఉంది” అని మోడీతో బైడెన్ చెప్పారు. ఇక ‘నేను మీ ఆటోగ్రాఫ్ తీసుకోవాలి’ అని సరదాగా అన్నారు. బైడెన్ ఎదుర్కొంటున్న సమస్యనే తానూ ఎదుర్కొంటున్నానని మోడీతో అల్బనీస్ చెప్పారు. 

మంగళవారం సిడ్నీలో జరగనున్న మోడీ ప్రోగ్రామ్​కు హాజరయ్యేందుకు అవకాశం కల్పించాలని చాలామంది ఫోన్లు చేస్తున్నారని తెలిపారు. ‘‘సిడ్నీలో మీరు పాల్గొననున్న కమ్యూనిటీ ఈవెంట్ టికెట్లు కావాలని చాలామంది అడుగుతున్నారు. కానీ అక్కడ 20 వేల మందికే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఇప్పటికీ టికెట్ల కోసం చాలామంది ఫోన్లు చేస్తున్నారు” అని మోడీతో అల్బనీస్ చెప్పారు.