- యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారిక ప్రకటన
- అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నిర్ణయం
- టారిఫ్ల రీఫండ్పై క్లారిటీ ఇవ్వని సీబీపీ
- కొత్త టారిఫ్లపైనా సందిగ్ధత
న్యూయార్క్: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్లకు బ్రేక్పడింది. ట్రంప్ నిర్ణయాలు చట్ట విరుద్ధంగా ఉన్నాయని.. ఆ దేశ సుప్రీంకోర్టు సంచనల తీర్పునిచ్చిన నేపథ్యంలో అమెరికా కీలక నిర్ణయం తీసుకున్నది. ట్రంప్ విధించిన టారిఫ్స్ వసూళ్లను మంగళవారం నుంచి నిలిపివేస్తున్నట్లు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
1977 నాటి ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ (ఐఈఈపీఏ) కింద అమలవుతున్న టారిఫ్ వసూళ్లు మంగళవారం తెల్లవారుజామున 12.01 గంటలకు (భారత కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు) నిలిచిపోతాయని పేర్కొన్నది. దీనికి సంబంధించిన అన్ని టారిఫ్ కోడ్లను తమ కార్గో సిస్టమ్స్లో డియాక్టివేట్ చేయాలని దిగుమతిదారులను ఆదేశించింది. అయితే, మధ్యంతర కాలంలో ఈ సుంకాలను వసూలు చేయడంపై ఏజెన్సీ ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
దిగుమతిదారులకు ఆ డబ్బును తిరిగి చెల్లిస్తారా? లేదా? అనే విషయంపై కూడా స్పష్టత ఇవ్వలేదు. ఈ సస్పెన్షన్ కేవలం ఐఈఈపీఏ కింద విధించిన టారిఫ్లకు మాత్రమే వర్తిస్తుంది. సెక్షన్ 232 (జాతీయ భద్రతా అధికారాలు), సెక్షన్ 301 (అన్యాయమైన వాణిజ్య చట్టాలు) కింద ఉన్న ఇతర ట్రంప్ కాలం నాటి సుంకాలను ఇది ప్రభావితం చేయదు.
ఇదిలా ఉండగా, అమెరికా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. ఎలాగైనా 15 శాతం సుంకాలను అమలు చేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ కొత్త టారిఫ్లు ఫిబ్రవరి 24 నుంచే అమల్లోకి వస్తాయని చెప్పినప్పటికీ.. ఇందుకు సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు ఇంకా జారీ కాలేదు. దీంతో కొత్త టారిఫ్లు మంగళవారం నుంచే వర్తిస్తాయా? లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
