నార్మల్​ డెలివరీ కోసం ఆక్సిటోసిన్​ ఇచ్చారు

నార్మల్​ డెలివరీ కోసం ఆక్సిటోసిన్​ ఇచ్చారు

హైదరాబాద్, వెలుగు: డెలివరీ టైంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి.. తీవ్ర అనారోగ్య సమస్యలతో శిశువు జన్మించేందుకు కారణమైన హాస్పిటల్ ​పై.. హైదరాబాద్​ కన్జూమర్ ఫోరం–2, రూ.60 లక్షల ఫైన్​ వేసింది. కోర్టు ఖర్చుల కింద మరో రూ.20 వేలు బాధితులకు చెల్లించాలని ఫోరం  ప్రెసిడెంట్​ వక్కంటి నర్సింహారావు, మెంబర్​ జవహర్​ బాబు ఆదేశించారు. తీర్పు వివరాలు ఇలా ఉన్నాయి..  నాగర్ ​కర్నూల్​ జిల్లా రాచాలపల్లికి చెందిన పెద్దగళ్ల శిరీష ఆరో నెల నుంచి హైదర్ ​గూడ ఫెర్నాండేజ్​ హాస్పిటల్​లోని డాక్టర్​ గీత కోలార్​ వద్ద చెకప్ ​కు  వెళ్లింది. ఫస్ట్​ డెలివరీ సిజేరియన్​ అయ్యిందని ముందే చెప్పింది. 2019, ఫిబ్రవరి 14న డెలివరీ కోసం రూ.50వేలు అడ్వాన్స్ ​గా పే చేసి హాస్పిటల్​లో జాయిన్​ అయ్యింది. తానే డెలివరి చేస్తానని శిరీషకు డాక్టర్​ గీత హామీ ఇచ్చి.. ఆ టైంకు రాలేదు. దీంతో డాక్టర్లు​ సుభాషిణి, వీణ కలిసి డెలివరీ చేయడానికి రెడీ అయ్యారు. నార్మల్​ డెలివరీ కోసం ఆక్సిటోసిన్​ ఇంజెక్షన్​ ఇచ్చారు. అయినా నార్మల్​ డెలివరీ కాకపోవడంతో ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3 గంటలకు సిజేరియన్​ డెలివరీ చేశారు. ఆ సమయంలో ఫస్ట్​ సిజేరియన్​ కుట్లు విడిపోవడంతో శిరీష విపరీతమైన వెన్నునొప్పితో బాధపడింది. పాపకు ఆక్సిజన్​ అందలేదు. అనేక అనారోగ్య సమస్యలు బయటపడ్డాయి. 46 రోజులు పాపను హాస్పిటల్​లోనే ఉంచి ట్రీట్​మెంట్​ ఇచ్చారు. ఆ టైంలో రూ.76వేలు ఖర్చు చేశారు. పాప ఎదుగుదల విషయంలో అనేక లోపాలు ట్రీట్​మెంట్​ టైంలో డాక్టర్లు గుర్తించారు. బిడ్డను చూసుకునేందుకు తల్లి శిరీష ఉద్యోగం మానేసుకుంది. ఇప్పుడు కూడా పాప వైద్యం కోసం రూ.60వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. హాస్పిటల్ యాజమాన్యాన్ని నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో 2020 అక్టోబర్​ 8న బాధితులు హైదరాబాద్​ కన్జుమర్​ ఫోరం–2ను ఆశ్రయించారు. 

నార్మల్​ డెలివరీకి ఆక్సిటోసిన్​ వినియోగం

తమ లోపం ఏమీ లేదని, పేషంట్​ ఇష్టప్రకారమే నార్మల్​ డెలివరీకి ట్రై చేశామని విచారణ సమయంలో వైద్యులు తెలిపారు. తమ వైద్యుల నిర్లక్ష్యం ఏమీ లేదని హాస్పిటల్​ మేనేజ్​మెంట్​ కూడా వాదించింది. ఆక్సిటోసిన్​ ఇంజెక్షన్​ గేదెలు, ఆవులలో పాల ఉత్పత్తి పెంచడానికి కూడా ఇస్తారని, ఇప్పుడు నార్మల్​ డెలివరీ కోసం కూడా ఇస్తున్నారని డ్యూటీ డాక్టర్లు బెంచ్​ ముందు వెల్లడించారు. మోతాదులోనే ఉపయోగిస్తామని చెప్పారు. ఇరువైపు వాదనలు విన్న ఫోరం..  ట్రీట్మెంట్​, మెడికల్​ రిపోర్టులను పరిశీలించింది. ట్రీట్మెంట్ టైంలో వైద్యుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, బాధితులకు రూ.60లక్షల పరిహారం, ఫిర్యాదు ఖర్చులకు మరో రూ.20వేలు ఇవ్వాలని ఫెర్నాండెజ్​ హాస్పిటల్​ మేనేజ్ ​మెంట్ ​ను ఆదేశించింది.