న్యాయానికి వేదికగా న్యాయవాదులు: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి 

న్యాయానికి వేదికగా న్యాయవాదులు: ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి 
  • కాకా ఆశయాలతో ముందుకెళ్తున్నాం: అంబేద్కర్​ కాలేజీ కరస్పాండెంట్​ జి.సరోజా వివేక్ 
  • లా కాలేజీలో ఘనంగా గ్రాటిట్యూడ్​ డే

ముషీరాబాద్,వెలుగు: న్యాయవాద వృత్తి గౌరవప్రదమైనదని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ విజయలక్ష్మి అన్నారు. క్షక్షిదారులకు న్యాయం అందించడానికి న్యాయవాదులు ఒక వేదికగా నిలుస్తారని పేర్కొన్నారు. బాగ్ లింగంపల్లి లోని కాకాస్ డాక్టర్ బీఆర్.అంబేద్కర్ లా కళాశాల 2026–27 బ్యాచ్ విద్యార్థుల గ్రాటిట్యూడ్ డేను శుక్రవారం కళాశాల ముట్ కోర్టు హాల్​లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ విజయలక్ష్మి, కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ జి.సరోజా వివేక్ హాజరయ్యారు. 

ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి విజయలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యను సమాజ సేవకు వినియోగిస్తూ దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. కాకా ఆశయాలు, విలువలు, సేవా దృక్పథంతో కళాశాల ముందుకెళ్తోందని కరస్పాండెంట్ సరోజా వివేక్ తెలిపారు. 

ఇక్కడ చదివిన అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకొని, సమాజంలో సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తి ద్వారా ప్రజలకు సేవ చేసే అవకాశాలు ఎక్కువని, విద్యార్థులు తమ వృత్తి జీవితంలో నిబద్ధత, నిజాయితీ, సేవాభావంతో ముందుకు సాగాలని చెప్పారు. ప్రిన్సిపాల్, లెక్చరర్లు, సిబ్బంది పాల్గొన్నారు.