కోదాడ , హుజుర్ నగర్ లో తాను, తన భార్య పోటీ చేస్తున్నట్లు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కోదాడ, హుజుర్ నగర్ ఎమ్మెల్యేల దోపిడీ, వికృత చేష్టలకు విసిగిపోయిన ప్రజలు వాళ్ళను ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. తమ ఇద్దరితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని స్థానాలను కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 70 స్థానాల్లో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల లిస్ట్ దోపిడీ దారులకు కేసీఆర్ వత్తాసు పలికినట్లుగా ఉందన్నారు ఉత్తమ్. దళిత బంధులో కమీషన్లు నొక్కిన ఎమ్మెల్యేలకు కూడా మళ్లీ టికెట్లు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో నిశబ్ధ విప్లవం నడుస్తుందని.. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చాడని ధ్వజమెత్తారు. దేశంలో మద్యం ఎక్కువ తాగే రాష్ట్రంగానూ.. అవినీతిలో అగ్రస్థానంలోనూ తెలంగాణ ఉందన్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు దోపిడీకి అలవాటు పడి సాధారణ ప్రజలను హింసిస్తున్నారని ఆరోపించారు.