
ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో దారుణం జరిగింది. పాఠశాలలోని తరగతి గదిలో సీటు కోసం గొడవ పడిన ఘటనలో తన తోటి విద్యార్థిని పిస్టల్ తో కాల్చి చంపాడు ఓ 10 వ తరగతి విద్యార్థి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు విద్యార్థులు బుధవారం రోజు తమ తరగతి గదిలో సీటు కోసం గొడవ పడ్డారు. క్లాస్ రూంలోనే ఒకరినొకరు కొట్టుకున్నారు. ఉపాధ్యాయులు మందలించిన తర్వాత.. వెనక్కు తగ్గినప్పటికీ ఇందులో ఒక విద్యార్థి మాత్రం కోపంతో రగులుతూనే ఉన్నాడు. గురువారం ఉదయం.. ఇంట్లోంచి ఆర్మీలో పని చేస్తున్న తన అంకుల్కు చెందిన లైసెన్స్డ్ తుపాకీ తీసుకుని స్కూలుకు వచ్చాడు. ఉదయం 11 గంటల సమయంలో బుధవారం తనతో గొడవపడ్డ విద్యార్థిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో విద్యార్ధి ప్రాణాలు కోల్పోయాడు. కాల్పులకు పాల్పడ్డ విద్యార్థిని కస్టడీలోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.