
మొరాదాబాద్: ఓ మహిళ తన బిడ్డ పెండ్లి కోసం బ్యాంకు లాకర్లో దాచుకున్న రూ.18 లక్షలకు చెదలు పట్టింది. యూపీలోని మొరాదాబాద్ కు చెందిన పాఠక్ అనే మహిళ గతేడాది అక్టోబర్లో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆషియానా బ్రాంచ్లోని తన లాకర్లో రూ.18 లక్షల నగదు దాచుకుంది. లాకర్అగ్రిమెంట్ రెన్యూవల్ కోసం బ్యాంకు అధికారులు ఆమెకు ఇటీవల సమాచారం ఇచ్చారు. బ్యాంకుకు వెళ్లిన పాఠక్ తన లాకర్ తెరిచి చూసి షాక్ తిన్నది.
అందులోని కరెన్సీ నోట్లు మొత్తం చెదలు పట్టి మట్టిగా మారాయి. దాన్ని చూసిన బ్యాంకు అధికారులూ ఆశ్చర్యపోయారు. బిడ్డ పెండ్లి కోసం దాచుకున్న డబ్బు పాడైపోవడంతో ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. న్యాయం చేయాలని డిమాండ్ చేయడంతో.. బ్యాంకు సిబ్బంది తమ హెడ్ఆఫీసుకు రిపోర్ట్ పంపారు. అయితే ఆర్బీఐ తాజా నిబంధనల ప్రకారం బ్యాంకు లాకర్లలో ఎలాంటి నగదు నిల్వ ఉంచకూడదని అధికారులు వెల్లడించారు.