- ఇంట్లో సోదాలు చేసి ఆపై అరెస్టు చేసిన ఈడీ అధికారులు
- బెదిరింపు రాజకీయాలంటూ సీఎం స్టాలిన్ మండిపాటు
చెన్నై: తమిళనాడు విద్యుత్, ఎక్సైజ్ శాఖల మంత్రి వి.సెంథిల్ బాలాజీని హవాలా కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మంగళవారం మంత్రి నివాసంలో అధికారులు సోదాలు చేశారు. అనంతరం రాత్రి ఆయనను సుదీర్ఘంగా విచారించినట్లు సమాచారం. ఆ సమయంలో తనకు ఆరోగ్యం సరిగాలేదని, ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో మంత్రిని ప్రభుత్వ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో ఆయనను అడ్మిట్ చేశారు.
మంత్రిని పరీక్షించిన వైద్యులు.. ఆయనకు సాధ్యమైనంత త్వరగా బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. ఈ కేసులో స్థానిక కోర్టు మంత్రికి ఈ నెల 28 వరకు జుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు, మంత్రి సెంథిల్ కనిపించడంలేదంటూ డీఎంకే నేతలు మద్రాస్ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ అధికారులు మంత్రిని అరెస్టు చేయడాన్ని సీఎం స్టాలిన్ ఖండించారు. ఆస్పత్రిలో సెంథిల్ను పరామర్శించాక మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నదని ఆరోపించారు. మంత్రిని అరెస్టు చేసే విషయంలో రూల్స్ పాటించలేదని ఆరోపించారు.
మంత్రి రిజైన్ చేయాలి: అన్నాడీఎంకే
హవాలా కేసులో అరెస్టయిన మంత్రి సెంథిల్ బాలాజీ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత, అన్నాడీఎంకే చీఫ్ కె.పళనిస్వామి డిమాండ్ చేశారు.