హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఉపయోగపడే వీ2ఎక్స్ టెక్నాలజీని సుజుకి మోటార్ కార్పొరేషన్ హైదరాబాద్ ఐఐటీలో బుధవారం ప్రదర్శించింది. దీనిని మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్) ఐఐటి హైదరాబాద్ (ఐఐటీహెచ్) ఫ్యూచరిస్టిక్ వీ2ఎక్స్, క్యాప్జెమినీతో కలిసి డెవెలప్ చేశామని ప్రకటించింది. ఈ విధానంలో రూటర్వంటి డివైజ్ను కారు వెనుక భాగంలో అమర్చుతారు. ఇది 5జీ లేదా వెహికల్ టు వెహికల్ డేటా ట్రాన్స్ఫర్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కారు సమీప రోడ్డులో ఎవరైనా తప్పుగా డ్రైవ్ చేసినా, అంబులెన్స్ వచ్చినా, రోడ్డు బాగా లేకున్నా కారులోని స్క్రీన్పై కనిపిస్తుంది. 5జీ టెక్నాలజీ లేని చోట డేటా ట్రాన్స్ఫర్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. అంటే నెట్ లేకున్నా పనిచేస్తుంది.
ఈ సందర్భంగా సుజుకీ ప్రతినిధులు మాట్లాడుతూ ‘‘ఇండియాలో ఏటా లక్షల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ట్రాఫిక్ రూల్స్ వయొలేషన్స్ చాలా ఎక్కువ. ప్రభుత్వం కార్లకు ఎయిర్బ్యాగ్స్ను తప్పనిసరి చేసింది. వీ2ఎక్స్ టెక్నాలజీని కూడా తప్పనిసరి చేస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. ఈ టెక్నాలజీ డెవెలప్మెంట్ మొదటిదశలో ఉంది. మార్కెట్లోకి రావడానికి కొన్నేళ్లు పడుతుంది. యూరప్ వంటి దేశాల్లో వీ2ఎక్స్ను ఇది వరకే వాడుతున్నారు”అని వివరించారు. వీ2ఎక్స్ అప్లికేషన్లను చూపే మొదటి ప్రోటోటైప్ కార్లను హైదరాబాద్ ఐఐటీ క్యాంపస్లో ప్రదర్శించారు.