
- నెలకోసారి సమావేశం నిర్వహిస్తం
- అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దయాల్ వెల్లడి
గచ్చిబౌలి, వెలుగు: ఉద్యోగులు తమ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈఫీఎఫ్)పై ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని అడిషనల్ సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ వైశాలి దయాల్ తెలిపారు. సోమవారం నానక్ రాంగూడలోని వర్చుసా కంపెనీలో మాదాపూర్ రీజినల్ ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మొదటి వార్షికోత్సవం నిర్వహించారు. అదేవిధంగా, ఈపీఎఫ్ పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వైశాలి దయాల్ చీఫ్ గెస్ట్గా హాజరై పలువురు ఉద్యోగులు ఈపీఎఫ్ పై అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఉద్యోగుల ఈపీఎఫ్ సమస్యలపై నెలకు ఒకసారి పలు కంపెనీల్లో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఈ సమావేశాల్లో ఉద్యోగులు ఎదుర్కొనే సమస్యలు తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఇది దేశవ్యాప్త కార్యక్రమమని, ఇందులో సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఉద్యోగుల పేరు, కంపెనీ మార్పు వంటి విషయాలను సమావేశాల్లో తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తర్వాత ఈపీఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడారు. ఉద్యోగుల ఈపీఎఫ్ సమస్యలు పరిష్కరించడానికి త్వరలోనే యూనిక్ నంబర్ కేటాయిస్తామని, దీంతో ఉద్యోగులు కంపెనీ మారినా.. పేరు మారినా.. సమస్యలుండవని తెలిపారు. 20 మంది ఉద్యోగులు, ఒక్కరికి 15వేలు జీతం ఉన్న కంపెనీ ఈపీఎఫ్ కి అర్హత ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎఫ్ రీజినల్ కమిషనర్ వివేక్ రామన్ రెడ్డి, వర్చుసా సెంటర్ హెడ్ కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రాజు పెండ్యాల పాల్గొన్నారు.