తెలంగాణలో ఇవాళ్టి(మంగళవారం,మే-12) నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాలా వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందుకోసం హైదరాబాద్ గన్ఫౌండ్రీలోని మహబూబియా కాలేజీలో ఏర్పాటు చేసిన సెంటర్ లో సిబ్బంది విధులకు హాజరయ్యారు. ఇందులో భాగంగా ముందు ఇంటర్ సెకండ్ ఇయర్ పేపర్లను దిద్దుతారు. తర్వాత ఫస్ట్ ఇయర్ ఆన్సర్ షీట్లను వాల్యుయేషన్ చేయడం జరుగుతుంది.
కరోనా వైరస్ క్రమంలో భౌతిక దూరం పాటించాల్సి ఉండడంతో వాల్యుయేషన్ సెంటర్లను 12 నుంచి 33కి పెంచారు. కరోనా నిబంధనల్లో భాగంగా ఇంటర్బోర్డు మూల్యాంకన కేంద్రాల దగ్గర అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అన్ని కేంద్రాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది.
ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రశ్నా పత్రాల వాల్యుయేషన్ జరగనుంది. మొత్తం 9.50 లక్షల మంది విద్యార్థులకు చెందిన 55 లక్షల జవాబు పత్రాలను 15 వేల మంది అధ్యాపకులు మూల్యాంకనం చేస్తారు. విధుల్లో పాల్గొనే లెక్చరర్లకు రవాణా, వసతి సదుపాయాలు కల్పించారు. పోలీసు పాస్లను కూడా అందజేశారు. జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు ప్రకటించే అవకాశముంది.