వందేమాతరం గీతాన్ని అవమానిస్తే జైలుకే.. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

వందేమాతరం గీతాన్ని అవమానిస్తే జైలుకే.. రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వందేమాతరం బిల్లు ప్రవేశపెట్టింది. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ ఈ బిల్లు ప్రవేశపెట్టారు. వందేమాతరాన్ని కించపరిస్తే జైలు శిక్ష విధించేలా కేంద్ర ప్రభుత్వం బిల్లు రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లును ఆమోదింపజేసుకుని చట్టాన్ని అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. వందేమాతరం పూర్తిగా పాడాలని కేంద్రం ఈ బిల్లులో నిబంధన తీసుకొచ్చింది.

అయితే.. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగాయి. విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. వందేమాతరం బిల్లుపై రాజ్యసభలో సోమవారం చర్చ జరగనుంది.

1905లో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమం ప్రారంభమైంది. అప్పుడు కూడా దేశం నలుమూలలా ‘వందేమాతర’ గర్జన ప్రతిధ్వనించింది. 1920లో సహాయనిరాకరణ ఉద్యమమైనా, 1930లో శాసనోల్లంఘన ఉద్యమమైనా, 1942లో క్విట్ ఇండియా ఉద్యమమైనా.. ప్రతిచోటా ‘వందేమాతర’ నినాదమే సింహగీతికై.. ప్రజల్లో ప్రేరణను కలిగించడంతో పాటుగా.. బ్రిటిషర్లకు నిద్రలేని రాత్రులను మిగిల్చింది. బ్రిటిష్ పోలీసులు చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్న చివరి క్షణాల్లోనూ.. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నోటినుంచి వచ్చిన తారకమంత్రం ‘వందేమాతరం’. 

వందేమాతరం గేయంపై వివాదం ఏంటంటే..
వందేమాతరం గేయానికి కాంగ్రెస్ పార్టీ, జవహర్‌‌ లాల్ నెహ్రూ అన్యాయం చేశారనేది బీజేపీ వాదన. జాతీయ గేయంలోని కొన్ని భాగాలు ముస్లింలకు నచ్చకపోవచ్చని మాజీ ప్రధాని నెహ్రూ అన్నారని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తుచేశారు. ‘‘1937లో మహ్మద్ అలీ జిన్నా వందేమాతరం గేయాన్ని వ్యతిరేకించారు. జిన్నా నేతృత్వంలోని ముస్లిం లీగ్.. వందేమాతరం గేయానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టింది. ఈ ప్రచారాన్ని ఖండించాల్సిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ.. ఆ ప్రచారానికే వత్తాసు పలికి వందేమాతరం గేయం నుంచి కొన్ని పంక్తులను తొలగించారు’’ అని మోదీ ఆరోపించారు.

ALSO READ : జంతర్ మంతర్ దగ్గర పేలిన పెల్లెట్ గన్స్ అంటే ఏంటి..?

గేయాన్ని కాంగ్రెస్ ‘తుక్డే.. తుక్డే’ (ముక్కలు ముక్కలు) చేసిందని, ఇది దేశ విభజనకు బీజాలు వేసిందని మోదీ విమర్శించారు. వందేమాతరం గీతంలోని మొదటి ఆరు చరణాలు తప్పనిసరిగా పాడాలని కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకువస్తుండటం గమనార్హం.