షాద్ నగర్,వెలుగు : పాడి రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. గురువారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి. చిన్నారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని అనంతరం వినతి పత్రం అందజేశారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేసి, వెంటనే పరిష్కరించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలోని విజయా డెయిరీని మూసి వేయించాలనే కుట్రతో ప్రైవేటురంగ డెయిరీ సంస్థలు ఏకమయ్యాయని ఆరోపించారు. ఇతర రాష్ట్రాల నుంచి పాలను దిగుమతి చేసుకొని రాష్ట్రంలోని పాడి రైతులకు నష్టాన్ని కలిగించే విధంగా వ్యవహరిస్తున్నాయని వివరించారు. ప్రభుత్వ సంస్థల్లో విజయా డెయిరీ ఉత్పత్తులను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కొంతకాలంగా పాడి రైతులకు విజయా డెయిరీ బకాయిలు ఉండగా.. వెంటనే చెల్లించేలా.. ఇన్సెంటివ్ బోనస్ రూ. 4 చెల్లించకుండా వాయిదా వేస్తున్నారని, వెంటనే ఇచ్చే విధంగా చూడాలని ఆయన కోరారు.