హైదరాబాద్, వెలుగు: ఇకపై ఎక్కడి నుంచైనా మీ వెహికల్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీ అడ్రస్ ఎక్కడ ఉన్నా మీరు కోరుకున్నచోట మీ బండి రిజిస్ట్రేషన్ చేసుకునేలా స్టేట్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తోంది. త్వరలోనే ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటోంది.
ఇప్పుడు ఇట్లుంది
ఇప్పుడున్న రూల్స్ ప్రకారం ఎక్కడ అడ్రస్ ఉంటే అక్కడి ఆర్టీఏ పరిధిలో, ఎక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంటే అక్కడే రెన్యూవల్ చేసుకోవాలనే నిబంధన ఉంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడేవారు. ఉదాహరణకు ఆదిలాబాద్కు చెందిన ఓ వ్యక్తి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ లేకపోతే రిజిస్ట్రేషన్ కోసం ఆదిలాబాద్లోని ఆర్టీఏకే వెళ్లాలి. ఎంప్లాయ్ కాబట్టి స్లాట్ సెట్టయ్యే అవకాశం ఉండదు. అక్కడికి వెళ్లినా ఒక్కరోజులో పనవుతుందనే నమ్మకం లేదు.
కొత్త విధానం ఇట్ల..
ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానంలో పాతలెక్కనే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇచ్చిన టైంకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ మీ అడ్రస్ ఎక్కడ ఉన్నా మీ ఇష్టమున్న ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేసుకునే చాన్స్ ఉంటుంది. ఆర్సీలో కూడా మీ అడ్రస్ ప్రూఫ్లో ఏది ఉందో ఆ అడ్రస్సే వస్తుంది. ‘దీనివల్ల టైం, డబ్బు వృథా కాదు. ఎక్స్ట్రా ఛార్జీలు కూడా ఉండవు. వీలైనంత త్వరగా ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేష్ తెలిపారు.
పూర్తి స్థాయి త్రీ టైర్ ఎప్పుడొస్తదో?
అన్ని ఆర్టీఏ ఆఫీసుల్లో ఆన్లైన్సేవలున్నా వాహనదారులకు మాత్రం అన్నీ పూర్తిస్థాయిలో అందడంలేదు. పర్మిట్ డ్రైవింగ్ లైసెన్స్ ఒక్కటే ఎక్కడైనా తీసుకునే చాన్స్ఉంది. ఇతర సేవల్లో మాత్రం సదరు వ్యక్తి మొదట ఏ ఆఫీసుకు వెళ్లాడో మళ్లీ అక్కడికే వెళ్లాల్సి ఉంటుంది. మరో చోట సేవలు వినియోగించుకోవాలంటే మొదట లైసెన్స్ పొందిన చోట ఎన్వోసీ తేవాలి. కాబట్టి రిజిస్ట్రేషన్ లెక్కనే మిగతా సేవలు కూడా ఉపయోగించుకునేలా త్రీటైర్ (ఆన్లైన్లో అన్ని ఆర్టీఏ కార్యాలయాల్లో సేవలు పొందడం) విధానం తేవాలని వాహనదారులు కోరుతున్నారు.