రాజకీయ నేతల బూతులకు..జనం పోలింగ్ బూతుల్లో బుద్ధి చెప్పాలి: వెంకయ్యనాయుడు

రాజకీయ నేతల బూతులకు..జనం పోలింగ్ బూతుల్లో బుద్ధి చెప్పాలి: వెంకయ్యనాయుడు

ఏ రంగంలోనైనా విలువలు ముఖ్యమన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. భారతీయ సంస్కృతి పెంచుకోవడం, పంచుకోవడమన్నారు. పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం శిల్పకళా వేదికలో  సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు.. భారతీయ సంప్రదాయాలు పాటించాలని సూచించారు. ఇష్టమైన పనిని  కష్టపడి చేస్తే నష్టపోయేది ఏమి లేదన్నారు. పార్లమెంటు, అసెంబ్లీలో గలాటాలు చూస్తే చాలా బాధేస్తుందన్నారు. ప్రజాజీవనంలో ఉన్న వాళ్లు విలువలు పాటించాలన్నారు. రాజకీయాల్లో ప్రమాణాలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా జీవనంలో ప్రమాణాలు పెంచాల్సిన అవసరముందన్నారు.  ప్రజాప్రతినిధుల బాషను చూసి జనం సిగ్గుపడుతున్నారని విమర్శించారు. నేతల బూతులకు పోలింగ్ బూతుల్లో బుద్ధి చెప్పాలని సూచించారు.

తన జీవితంలో అవార్డులు పెద్దగా తీసుకోలేదని వెంకయ్యనాయుడు తెలిపారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి. 4 కి.మీ నడిచి స్కూలుకు  వెళ్లి అంచెలంచెలుగా ఎదిగిన తనను కేంద్రం గుర్తించినందుకు గౌరవంగా పద్మవిభూషన్ ను స్వీకరిస్తున్నా అని చెప్పారు. పద్మ అవార్డులు అందుకున్న తెలుగు వారిని  సన్మానించాలన్న సీఎం రేవంత్ నిర్ణయాన్ని  అభినందిస్తున్నా..ఇది చాలా మంచి సంప్రదాయం అని  అన్నారు. రేవంత్ హయాంలో తెలంగాణలో మంచి అభివృద్ధి జరగాలన్నారు.

తెలుగు కళామతల్లికి రెండు కళ్లు ఎన్టీఆర్, ఏఎన్నార్, రెండు కళ్లు అయితే..మూడో కన్ను  చిరంజీవి అని కొనియాడారు వెంకయ్యనాయుడు.  పద్మ అవార్డులకు ఎంపికైన వారిని తెలంగాణ ప్రభుత్వం శిల్పకళా వేదికలో  సన్మానించింది. ఈ సందర్భంగా మాట్లాడిన వెంకయ్య నాయుడు.. చిరంజీవి తన నటనతో ప్రజలన మెప్పించేందుకు   నిరంతరం శ్రమించారని చెప్పారు. ప్రమాణాలు పాటిస్తూ అసభ్యత, అశ్లీలత, హింసకు తావు  ఇవ్వకుండా నటించడం  చిన్న విషయం కాదన్నారు. ఈ విషయంలో చిరంజీవి ఇతరులకు ఆదర్శమన్నారు. పెద్ద నటుడిగా పేరు వచ్చినా.. సామాన్య ప్రజలకు బ్లడ్ బ్యాంక్ ద్వార సేవ చేయడం సంతోషకరమన్నారు.