
తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని చిన్న ఊళ్లో పుట్టి, పెద్దగా చదువుకోకపోయినా, టెక్నాలజీపై పట్టుతో ఇండియాలో రెండు లిస్టెడ్ కంపెనీలు పెట్టి, ఆ తర్వాత సింగపూర్ కేంద్రంగా మెరిడియన్ టెక్ పీటీఈ లిమిటెడ్ కంపెనీ పెట్టి, కొంత కాలానికి యూఎస్లోని చిరునామాతో నాస్డాక్ లిస్టింగ్ పొంది, ఇప్పుడు 20 ఏళ్ల జైలు శిక్ష, రూ. 34 కోట్లు (5 మిలియన్ డాలర్ల) జరిమానా కేసును ఎదుర్కొంటున్న వెంకట్ మీనవల్లి కథ ఇది. నాస్డాక్ లిస్టింగ్ కంటే చాలా ముందే ప్రముఖ బాలీవుడ్ నటులు, తండ్రీ కొడుకులు అమితాబ్, అభిషేక్ బచ్చన్లు తమ కంపెనీలో పెట్టుబడి పెట్టారని ఇండియాలోనూ ప్రచారం చేసుకున్నారు వెంకట్ మీనవల్లి.
హైదరాబాద్, వెలుగు : నార్త్గేట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ( తర్వాత గ్రీన్ఫైర్ అగ్రి కమోడిటీస్, ప్రస్తుతం ప్రొసీడ్ ఇండియా) , బ్రిలియంట్ సెక్యూరిటీస్ లిమిటెడ్ (ఇప్పుడు స్టాంపీడ్ కాపిటల్) వంటి పబ్లిక్ కంపెనీలను హైదరాబాద్లో నెలకొల్పిన వెంకట్ మీనవల్లి అమెరికాలో అకౌంటింగ్ మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లాంగ్ఫిన్ కార్ప్ పేరిట క్రిప్టో కరెన్సీ కంపెనీ పెట్టిన వెంకట్ దాని నాస్డాక్ లిస్టింగ్ కోసం రెవెన్యూను ఎక్కువ చేసినట్లు కనుగొన్నారు. రూ.457 కోట్లు ( 66 మిలియన్ డాలర్ల) మేర ఆదాయాన్ని అధికం చేసి ఇన్వెస్టర్లను మోసగించినట్లు గుర్తించారు. పబ్లిక్ ఇష్యూకు వెళ్లేందుకే ఈ మోసాలకు పాల్పడినట్లు యూఎస్ అటార్ని క్రెగ్ కార్పెనిటో తెలిపారు. అమెరికాలోని రెండు ప్రధాన స్టాక్ ఎక్స్చేంజ్లలో నాస్డాక్ ఒకటి. సాధారణంగా టెక్నాలజీ కంపెనీలు నాస్డాక్ లిస్టింగ్కు మొగ్గుచూపుతాయి.కమోడిటీస్ ట్రేడింగ్, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, బ్లాక్చైన్ సొల్యూషన్స్ కార్యకలాపాల కోసం లాంగ్ఫిన్ కార్ప్ను నెలకొల్పారు.
బ్లాక్చైన్ టెక్నాలజీ రంగంలో వినూత్నమైన ఆవిష్కరణ పేరుతో కంపెనీ ఒక ప్రకటన చేయడంతో 2017లో లాంగ్ఫిన్ షేర్ ధర అమాంతం 2000 శాతం పెరిగింది. దీంతో యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ (ఎస్ఈసీ) కూడా ఈ మోసం మీద చర్యలను ప్రకటించింది. అకౌంటింగ్ మోసాలకుగాను లాంగ్ఫిన్ కంపెనీ మీద, ప్రమోటర్ వెంకట్ మీనవల్లితోపాటు ఆ కంపెనీ నాస్డాక్ లిస్టింగ్కు కన్సల్టెంట్గా వ్యవహరించిన వ్యక్తి మీదా ఎస్ఈసీ కేసులు దాఖలు చేసింది. లాంగ్ఫిన్ కార్ప్ ఆదాయం భారీగా పెంచి చూపించడం ద్వారా అకౌంట్లలో అవకతవకలకు, మోసానికి వెంకట్ మీనవల్లి పాల్పడ్డారని ఎస్ఈసీ ఆరోపిస్తోంది. నాస్డాక్లో లిస్టింగే లక్ష్యంగా అకౌంటింగ్ మోసాలు చేశారని ఎస్ఈసీ చెబుతోంది. తప్పుడు సమాచారంతో లిస్టింగ్ పొందడం ద్వారా ఇన్వెస్టర్ల ప్రయోజనాలకూ భంగం కలిగించినట్లు స్పష్టమవుతోందని పేర్కొంటోంది.
ఆదాయం వచ్చే ఎలాంటి క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ను లాంగ్ఫిన్ కార్ప్ నిర్వహించలేదని, బ్లాక్చైన్ సొల్యూషన్స్ ఏవీ వాడనేలేదని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్తో సంబంధం లేకుండా వర్చువల్గా ట్రాన్సాక్షన్స్ నిర్వహించడానికి వీలు కల్పించేదే క్రిప్టో కరెన్సీ. ఈ క్రిప్టో కరెన్సీ నిర్వహణకు ఎన్క్రిప్షన్ టెక్నాలజీ వినియోగిస్తారు. తన ఆదాయం మిలియన్ల డాలర్లని కంపెనీ చెబుతున్నా, నిజానికి లాంగ్ఫిన్ కార్ప్కు అసలు ఆదాయమే లేదని, కమోడిటీస్ ట్రేడింగ్ మాత్రమే నిర్వహించిందని ప్రాసిక్యూటర్లు అంటున్నారు. ఈ కమోడిటీస్ ట్రేడింగ్ ట్రాన్సాక్షన్స్ కూడా వెంకట్ మీనవల్లికి చెందిన ఇతర కంపెనీలతోనే నిర్వహించారని ఆరోపిస్తున్నారు. 66 మిలియన్ డాలర్ల ఆదాయం ఉందని చెబుతూ ఎస్ఈసీ వద్ద దాఖలు చేసిన ఫైలింగ్స్లో లాంగ్ఫిన్ కార్ప్ పేర్కొంది. ఈ ఆదాయం లేనే లేదని, అసలు ఆదాయంగా దానిని గుర్తించనే కూడదని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతోంది.
లేని ఆదాయాన్ని చూపడం ద్వారా ఇన్వెస్టర్లను బుట్టలో వేసేందుకు ప్రమోటర్ వెంకట్ మీనవల్లి, లాంగ్ఫిన్ కార్ప్ ప్రయత్నించినట్లు ఆరోపిస్తోంది. 2017లో యూఎస్ ఎస్ఈసీ వద్ద దాఖలు చేసిన ఫార్మ్ 10–కే (యాన్యువల్ రిపోర్ట్)లో స్ట్రక్చర్డ్ ట్రేడ్ ఫైనాన్స్, ఫిజికల్గా కమోడిటీస్ అమ్మకం ద్వారా తమకు ఆదాయం సమకూరుతున్నట్లు లాంగ్ఫిన్ కార్ప్ అప్పట్లో వెల్లడించింది. అసలు జరగని కమోడిటీస్ లావాదేవీల నుంచి రావాల్సిన ఆదాయమంటూ (రిసీవబుల్స్) అకౌంట్లలో లాంగ్ఫిన్ కార్ప్ చూపించింది. లాంగ్ఫిన్ కార్ప్తో లావాదేవీలు నిర్వహించిన అనేక కంపెనీలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వెంకట్ మీనవల్లికి సంబంధం ఉంది. ఐతే, ఈ సంబంధాన్ని ఇన్వెస్టర్లకు చెప్పకుండా వెంకట్ దాచిపెట్టినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చెబుతున్నారు. వెంకట్ చేసిన మోసాలకు అమెరికాలోని చట్టాల ప్రకారం గరిష్టంగా 20 ఏళ్ల జైలుశిక్ష, 5 మిలియన్ డాలర్ల ఫైన్ విధిస్తారని ప్రాసిక్యూటర్లు వెల్లడిస్తున్నారు. ఇక ఇండియాలో గతంలో పెట్టిన నార్త్గేట్ టెక్నాలజీస్, బ్రిలియంట్ సెక్యూరిటీస్ కంపెనీలలో డైరెక్టర్గా వెంకట్ ఇంతకు మునుపే వైదొలిగారు. ఈ రెండు కంపెనీలనూ అన్నీ తానై నడిపించిన వెంకట్ అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీ కంపెనీ ఏర్పాటు దిశలో చొరవ తీసుకునేందుకే బహుశా ఈ కంపెనీలను వదిలి వెళ్లారని సన్నిహితులు చెబుతారు.