కాంతిదీపాలుగా ప్రభుత్వ కాలేజీలు

కాంతిదీపాలుగా ప్రభుత్వ కాలేజీలు

విద్యా సంవత్సరం 2024‌‌–25లో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించారు. వీరంతా  వివిధ ఇంటర్ కాలేజీల్లో చేరే అవకాశం ఉంది. తెలంగాణలో  సుమారుగా మొత్తం 3008 జూనియర్ కాలేజీలు ఉన్నట్టు తెలుస్తోంది. వీటిలో 1,358 కాలేజీలు ప్రభుత్వం లేదా ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ విద్యాసంవత్సరంలో 120 కేజీబీవీలు అప్​గ్రేడ్​ చేశారు.  303 కేజీబీవీలలో 32,240 మంది విద్యార్థినులు చేరేందుకు అవకాశం ఉంది. 

జూనియర్​ కాలేజీలు జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించి విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్ది సమాజానికి అందించాలి.  అత్యధిక శాతం విద్యార్థులు ప్రైవేట్​ కాలేజీల్లో, కార్పొరేట్​ కాలేజీల్లో చేరుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు మంచి భవిష్యత్తు కోసం అని కార్పొరేట్​ కాలేజీలను ఎన్నుకుంటున్నారు. 

కాగా, 2024 కుటుంబ సర్వే ప్రకారం మన రాష్ట్రంలో 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్టు తెలుస్తోంది. 90 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్​కార్డులు ఉన్నాయి. ఇంకా 10 లక్షల పైచిలుకు కొత్త దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావించడానికి కారణం వీరిలో చాలా కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరడం లేదు. పైగా లక్షల రూపాయలు వెచ్చించి ప్రైవేట్, కార్పొరేట్​ కాలేజీల్లో చేరుతున్నారు.

తల్లిదండ్రులకు కౌన్సెలింగ్​ ఇవ్వాలి

విద్యార్థులు అధిక ఒత్తిడికి లోనవడంతో కొన్ని సమయాల్లో విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ అనర్థాలకు పరోక్షంగా తల్లిదండ్రులే కారణం అవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్​ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కన్నవారి కలలు నెరవేర్చే క్రమంలో పిల్లలు చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రుల అత్యాశ వారి పిల్లలకు పెనుశాపంగా మారుతోంది. 

ప్రతి సంవత్సరం దాదాపు 10 నుంచి 15 మంది విద్యార్థులు ఒత్తిడితో బలవన్మరణాలకు లోనవుతున్నారు. అయినప్పటికీ విద్యార్థుల పేరెంట్స్​లో మార్పు రావడం లేదు. ప్రైవేట్, కార్పొరేట్​ కళాశాలల మాయాజాలంలోపడి తమ పిల్లల అవగాహన సామర్థ్యంను తెలుసుకోలేకపోతున్నారు. తమ పిల్లల ఇష్టాలు, ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం శోచనీయం. సిలబస్​ విషయానికి వస్తే ముఖ్యంగా బైపీసీ, ఎంపీసీలో సీబీఎస్​ఈ (ఎన్​సీఈఆర్​టీ), స్టేట్​ సిలబస్​లను బోధించడం పూర్తిగా మానేశారు. 

కేవలం ఐఐటీ, జేఈఈ, నీట్ పేరిట ప్రైవేట్​ బుక్స్ కొనిపించి వాటినే బోధిస్తున్నారు. వీటికోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అదనంగా 5వేల నుంచి 20 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇది ఒక రకంగా మోసం అని చెప్పాలి. ఐఐటీ, జేఈఈ, నీట్​2025 ప్రశ్నపత్రాలను పరిశీలించినట్లయితే సీబీఎస్ఈ, స్టేట్​గవర్నమెంట్​ బుక్స్​నుంచి 75 శాతం ప్రశ్నలు వచ్చాయి. ఈ వాస్తవాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలి. సీబీఎస్​ఈ బుక్స్​ అనుసరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. 

విద్యార్థుల జీవితాలతో చెలగాటం

 ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గటానికి ముఖ్య కారణం విద్యాశాఖ ఉన్నతాధికారులే.  ప్రతి జిల్లాకు టీజీబీఐఈ ద్వారా నియమించిన ఒక అధికారి ఉంటాడు. వీరు, వీరి సిబ్బంది కాసులకు కక్కుర్తిపడి సరైన వసతులు లేకున్నా అదనపు తరగతులు అనుమతిస్తున్నారు. దీంతో అపార్ట్​మెంట్స్​లో  తరగతులను నిర్వహించే పరిస్థితి నెలకొంది. 

స్టడీ సెంటర్​ పేరుమీద,  కోచింగ్​ సెంటర్​ పేరుమీద  తరగతులను నిర్వహిస్తున్నారు. లంచాలకు అలవాటుపడిన కొంతమంది అధికారులు విద్యార్థుల సంక్షేమాన్ని గాలికొదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వసతి గృహాలు చీకటి కుహారాలుగా పగలు, రాత్రి తెలియకుండా ఉంటున్నాయి. 

విద్యార్థుల జీవితాలతో అధికారులు చెలగాటం ఆడుకోవడం గర్హనీయం. కాగా, ప్రభుత్వ కాలేజీల్లో గొప్ప నిష్ణాతులైన అధ్యాపక బృందాలు ఉన్నాయి. వారు తమ ప్రతిభతో పోటీపరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాలు పొందినవారు. వారి సేవలను వినియోగించుకోవడం మన ధర్మం. పేద, మధ్య తరగతి కుటుంబాలు అనవసర ఆడంబరాలకు పోకుండా ప్రభుత్వ కాలేజీల్లో చేరడం శ్రేయస్కరం. విద్యార్థులు ఒత్తిడితో కాకుండా ఆనందంగా చదివి బంగారు భవిష్యత్తుకు బాట వేసుకోవాలి.  ప్రైవేట్, కార్పొరేట్​కాలేజీల మాయాజాలంలోచిక్కుకోవద్దు. విద్యార్థులకు క్రమశిక్షణే బంగారు భవిష్యత్తును ఇస్తుందని గుర్తించాలి. - 

-వేణుగోపాల్ నరెడ్ల-