పాకిస్థాన్లో సైనిక పాలన సాగించిన జనరల్ ముషారఫ్ (76)కి లాహోర్ ప్రత్యేక కోర్టు మంగళవారం నాడు ఉరి శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 167 పేజీల ఆ తీర్పు కాపీని పరిశీలిస్తే షాకింగ్ విషయాలు బయటికొచ్చాయి. దేశ ద్రోహం కేసులో దోషిగా తేలిన ముషారఫ్ ఒకవేళ ఉరి అమలు చేసే లోపే చనిపోతే.. ఆయన శవాన్నైనా బహిరంగంగా వేలాడదీయాలని కోర్టు ఆదేశించింది. అది కూడా పార్లమెంటు, అధక్ష భవనం సహా ఇతర పరిపాలన భవనాల ఎదుట ఉండే డీ-చౌక్ (డెమొక్రటిక్ చౌక్) రోడ్డు జంక్షన్లో మూడ్రోజుల పాటు డెడ్ బాడీని ఉరి వేయాలని తీర్పులో పేర్కొంది.
2007 నవంబర్ 3న రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి పాక్లో ఎమర్జెన్సీ విధించినందుకు కోర్టు ముషారఫ్కు ఈ శిక్ష విధించింది. 2013లో ఆయనపై దేశద్రోహం కేసు నమోదయింది. ఆరోగ్యం దెబ్బతిన్నదని చెప్పి 2016లో ట్రీట్మెంట్ కోసం దుబాయ్ పరారయ్యారు ముషారఫ్. ఆ తర్వాత మళ్లీ పాక్లో అడుగుపెట్టలేదు.
పాక్ చరిత్రలో ఇలా ఉరి శిక్ష ఎదుర్కొంటున్న రెండో లీడర్ ముషారఫ్. గతంలో జుల్ఫికర్ అలీ భుట్టోకి మిలటరీ పాలనలో ఉరి శిక్ష పడితే, ఈసారి పర్వేజ్ ముషారఫ్కి పార్లమెంటరీ సిస్టమ్లో క్యాపిటల్ పనిష్మెంట్ పడింది. ఈ ఇద్దరూ కూడా పాకిస్థాన్కి ప్రెసిడెంట్లుగా పనిచేసినవాళ్లే.
ముషారఫ్…
1999లో ప్రజాస్వామికంగా ఎన్నికైన నవాజ్ షరీఫ్ని కూలదోసి, 2001లో ముషారఫ్ మిలటరీ పాలన ఏర్పాటు చేశారు. కార్గిల్ వార్ విషయంలో నవాజ్ షరీఫ్ తప్పుల వల్లే పాక్ ఓడిపోయిందంటూ ఆయన్ని అధికారంలో నుంచి దించేసి హౌస్ అరెస్టు చేశారు నాడు ఆర్మీ చీఫ్గా ముషారఫ్. నాటి నుంచి పొలిటకల్ పార్టీలు ఎన్నికలు పెట్టాలని ఎప్పుడు ఒత్తిడి చేసినా ఏవో కారణాలు చేప్పటి నెట్టుకొచ్చారు. కానీ, 2007లో అధికారం చేజారే పరిస్థితులు రావడంతో దేశంలో ఎమర్జెన్సీ విధించి, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేశారు. దీనిపై 2013లో దేశ ద్రేహం కింద కేసు నమోదైంది.
జుల్ఫీకర్ అలీ భుట్టో
1971 నుంచి 73 వరకు ప్రెసిడెంట్గా పనిచేసి, ఆ తర్వాత పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా ఎన్నికలు జరిపించి ప్రధాని అయ్యారు జుల్ఫీకర్ అలీ భుట్టో. 1977లో ఆయన నియమించిన ఆర్మీ చీఫ్ జనరల్ జియావుల్ హక్ తిరుగుబాటుతో పదవి కోల్పోయారు. ప్రతిపక్షానికి చెందిన ఒక యువ నాయకుడిని హత్య చేయించడానికి కుట్ర పన్నారన్న ఆరోపణపై జనరల్ జియా ఆయనను అరెస్టు చేశారు. ఆ తర్వాత భుట్టోకి కోర్టు మరణ శిక్ష విధించగా, అయిదు నెలల తర్వాత రావల్పిండిలో ఉరి తీసేశారు.