
అంబర్పేట, వెలుగు: లక్షల్లో డబ్బులు తీసుకుని సరైన ట్రీట్మెంట్ చేయలేదని అంబర్ పేటలోని సీజన్ ఆసుపత్రి ముందు సోమవారం బాధితులు ఆందోళనకు దిగారు. ఆరు నెలల్లో మూడుసార్లు కాలుకు ఆపరేషన్ చేశారని ప్రతిసారి ఆపరేషన్ ఎందుకు వికటిస్తోందని డాక్టర్లను కుటుంబ సభ్యులు నిలదీశారు. న్యాయం జరిగేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని సీజన్ ఆసుపత్రి ముందు సోమవారం నిరసనకు దిగారు. నల్గొండ జిల్లా కొండ మల్లేపల్లి నివాసి హతిరామ్ నాయక్ కుమారుడు రామావత్ హరినాయక్ (18) కాలు విరగడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.
మెరుగైన వైద్యం కోసం అంబర్పేటలోని సీజన్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆరు నెలల కింద ఆపరేషన్ జరిగినా కాలు బాగు కాలేదు. మూడు సార్లు ఆపరేషన్ చేయగా ప్రతిసారి వికటించిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆపరేషన్కు తమ వద్ద లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఆసుపత్రి యాజమాన్యం సరైన వైద్యం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఆసుపత్రి ముందు ఆందోళన కొనసాగిస్తామని బాధితులు ధర్నా చేపట్టారు.