- ఇమ్రాన్ ఖాన్ పార్టీ నేతల ప్రచారం
- పాకిస్తాన్లో మోడీ వీడియో వైరల్
న్యూఢిల్లీ: మన ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం వీడియో పాకిస్తాన్లో ట్రెండ్ అవుతోంది. పాక్ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభానికి ఆ దేశ ప్రస్తుత ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ విధానాలే కారణమంటూ మాజీ పీఎం ఇమ్రాన్ఖాన్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగానే రాజస్థాన్లో మోడీ మాట్లాడిన వీడియోను పాకిస్తాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) నేతలు షేర్ చేస్తున్నారు. పాక్ ప్రభుత్వం సిగ్గుపడాలంటూ కామెంట్లు పెడ్తున్నారు. ప్రధాని పదవి నుంచి షెహబాజ్ దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ వీడియోలో ఏముందంటే..
2019 ఎన్నికలపుడు పాకిస్తాన్పై విమర్శలు చేస్తూ రాజస్థాన్లోని బార్మర్లో మోడీ మాట్లాడిన వీడియోను పీటీఐ నేత అజంఖాన్ సోమవారం ట్వీట్ చేశారు. ఆ వీడియోలో.. ‘‘పాక్ అహంకారాన్ని అణిచేసినం. ప్రపంచమంతటా తిరిగి అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చినం. ఆ దేశ బెదిరింపులకు భయపడే పరిస్థితిని తప్పించాం. వాళ్ల దగ్గర న్యూక్లియర్ వెపన్లుంటే.. మాదగ్గరున్నవాటిని దీపావళి కోసం దాచుకున్నమా?” అని మోడీ అన్నట్లుగా ఉంది. అయితే, 2019లో ఇమ్రాన్ అధికారంలో ఉన్నప్పుడే మోడీ ఈ మాటలన్నారని పలువురు కౌంటర్ ఇస్తున్నారు. మోడీ చెప్పింది మిమ్మల్ని ఉద్దేశించే, జర చూస్కోండి అంటూ కామెంట్లు పోస్టు చేస్తున్నారు.