
చెన్నై: టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల ప్రచార ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. తొక్కిసలాట ఘటనపై సీబీఐ లేదా స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తొక్కిసలాట ప్రమాదవశాత్తూ జరిగింది కాదని.. దీని వెనక కుట్ర ఉందని ఆరోపించింది. విజయ్ ర్యాలీలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు దాడి చేయడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతోనే ఈ దుర్ఘటన జరిగిందని పిటిషన్లో టీవీకే పార్టీ పేర్కొంది. టీవీకే పార్టీ దాఖలు చేసిన ఈ పిటిషన్పై 2025, సెప్టెంబర్ 29న మద్రాస్ హైకోర్టులో విచారణ జరగనున్నట్లు సమాచారం.
కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (సెప్టెంబర్ 27) రాత్రి కరూర్ జిల్లా కేంద్రంలో టీవీకే అధినేత విజయ్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్కు జనం, విజయ్ అభిమానులు భారీగా తరలివచ్చారు. పోలీసుల నుంచి పర్మిషన్ 10 వేల మందికి తీసుకుంటే ఈ సమావేశానికి దాదాపు 50 వేల మంది హాజరైనట్లు సమాచారం. దీంతో జనం రద్దీ ఎక్కువై తొక్కి సలాట జరిగింది. ఈ ఘటనలో 39 మంది మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. 11 మందికి ఐసీయూలో ట్రీట్మెంట్ అందిస్తు్న్నారు.
మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు. తొక్కిసలాట ఘటనపై తమిళనాడు ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. రిటైర్డ్ హైకోర్టు జడ్జి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు.. తొక్కిసలాటకు బాధ్యులుగా టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్, జాయింట్ సెక్రటరీ నిర్మల్ కుమార్, కరూర్ జిల్లా టీవీకే పార్టీ కార్యదర్శిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట వెనక కుట్ర ఉందంటూ టీవీకే పార్టీ హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.