వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను ఆమె తల్లి విజయమ్మ చంచల్ గూడ జైల్లో కలిశారు. షర్మిలను విజయమ్మ పరామర్శించారు. మొత్తం 30 నిమిషాల పాటు షర్మిలతో విజయమ్మ మాట్లాడారు. ఆమెకు ధైర్యం చెప్పారు.
ప్రశ్నించె గొంతు నొక్కుతున్నారు...
తెలంగాణ ప్రభుత్వంపై వైఎస్ విజయమ్మ ఫైర్ అయ్యారు. షర్మిల ప్రజల తరపున పోరాడుతోందని..అందుకే ఆమె గొంతు నొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ అధికారులను కలిస్తే వచ్చే నష్టమేంటని ప్రశ్నించారు. షర్మిల ఏమైనా టెర్రరిస్టా అని నిలదీశారు. శాంతియుతంగా పోరాటం చేస్తుంటే ఎందుకు అరెస్ట్ చేస్తున్నారన్నారు. నిరుద్యోగ సమస్యను వెలుగులోకి తెచ్చిందే షర్మిల అని చెప్పారు.
షర్మిలపై కేసులు..
ఏప్రిల్ 24వ తేదీన పోలీసులపై దాడి చేసిన కేసులో షర్మిలను అరెస్ట్ చేశారు. ఎస్సై రవీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 4 సెక్షన్లు 332, 353, 509, 427 కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను 14 రోజుల రిమాండ్ నిమిత్తం చంచల్ గూడా జైలుకు తరలించారు. ఏప్రిల్ 24వ తేదీ షర్మిల సిట్ ఆఫీస్ కు వెళ్లబోతుందన్న సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆమెను ముందస్తు అరెస్ట్ చేయడానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆమెను అరెస్ట్ చేస్తుండగా మహిళా కానిస్టేబుల్ ను షర్మిల తోసేశారు. ఎస్సై పట్ల దురుసుగా ప్రవర్తించారు. మరో కానిస్టేబుల్ కాలుపై నుంచి షర్మిల కారు పోనీయడంతో గాయాలయ్యాయి. పోలీసులపై దాడి చేసినందుకు గానూ షర్మిలను అరెస్ట్ చేస్తున్నట్టు జూబ్లీహిల్స్ పోలీసులు అధికారికంగా ప్రకటించారు.