రాబోయే రోజుల్లో కేసీఆర్​కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు:విజయశాంతి

రాబోయే రోజుల్లో కేసీఆర్​కు ప్రజలు తగిన బుద్ధి చెప్తారు:విజయశాంతి

షాద్​నగర్ , వెలుగు: రాబోయే రోజుల్లో కేసీఆర్​కు ప్రజలు తగిన బుద్ధి చెప్పి, గద్దె దించుతారని బీజేపీ జాతీయ నాయకురాలు విజయశాంతి అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కోడిచెర్ల గ్రామ సర్పంచ్ వెంకట్ రెడ్డి తో పాటు పలువురు ముఖ్య నాయకులు బుధవారం విజయశాంతి సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ను నమ్మి ఓటేస్తే  రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రూ. 5 లక్షల కోట్ల అప్పును ప్రజల నెత్తిపై పెట్టాడన్నారు.

కల్వకుంట్ల కుటుంబ పాలన అవినీతిమయమని ఆరోపించారు. ఉద్యమ సమయంలో తనను కడుపులో పెట్టి చూసుకుంటానని మాటిచ్చిన కేసీఆర్.. తర్వాత కడుపులో తన్ని బయటకు పంపించారని మండిపడ్డారు. నమ్మించి మోసం చేయడంలో ఆయన నంబర్ వన్ అన్నారు. పేద ప్రజల అసైన్డ్ భూములు లాక్కోవడమే కాకుండా, కార్పొరేషన్ నిధులు దారి మళ్లించారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా భాజపా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, సీనియర్ నాయకులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి, అందె బాబయ్య, పాలమూరు విష్ణువర్థన్ రెడ్డి పాల్గొన్నారు.