
- ధరణి డేటా హ్యాక్ అయితే పరిస్థితేంటి?
హైదరాబాద్, వెలుగు: ధరణి పోర్టల్లో భూ రికార్డుల భద్రతపై అనుమానాలున్నాయని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి ఆరోపించారు. రాష్ట్రంలోని మొత్తం భూముల రికార్డులను దివాళా తీసిన టెర్రాసిస్ చేతుల్లో పెట్టడం సర్కారు దివాళాకోరుతనాన్ని బయట పెట్టిందని శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మండిపడ్డారు. బ్యాంకులకు వేలకోట్లు ఎగ్గొట్టినట్టు ఆరోపణలున్న ఐఎల్ఎఫ్ఎస్ అధీనంలో ఈ టెర్రాసిస్ సంస్థ ఉండేదని తెలిపారు. ఇప్పుడు టెర్రాసిస్లో సగానికిపైగా వాటాను ఫిలిప్పీన్స్కు చెందిన ఫాల్కన్ గ్రూపుకు ఐఎల్ఎఫ్ఎస్ అమ్మేసిందని చెప్పారు. అలాంటి సంస్థకు ధరణి కాంట్రాక్టును కట్టబెట్టడం వల్ల మన భూముల వివరాలు మొత్తం విదేశీ కంపెనీ చేతుల్లోకి వెళ్లాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ వ్యవస్థలో రిఫార్మ్స్ పేరిట తీసుకొచ్చిన పోర్టల్లోని సమస్యలతో రైతులు ఇప్పటికే గుండెలు బాదుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 లక్షల మందికి చెందిన కోటిన్నర ఎకరాల భూములు, ప్రభుత్వ, ఎండోమెంట్, వక్ఫ్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లకు చెందిన కోటి ఎకరాలకు పైగా భూముల సమాచారాన్ని దివాళా తీసిన కంపెనీ చేతిలో పెట్టడం సరికాదని అన్నారు. ఈ డేటాపై సైబర్ దాడులు జరిగి హ్యాక్ అయితే మన రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఏవైనా సమస్యలొస్తే మాన్యువల్ రికార్డుల ద్వారా పరిష్కారం దొరుకుతుందని, కానీ, వాటిని పరిరక్షించే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయడం లేదని విజయశాంతి ఆరోపించారు. భూ రికార్డుల భద్రతపై సమాచర హక్కు చట్టం ద్వారా అడిగినా సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.