కేంద్రంలో, తెలంగాణలో వచ్చేది బీజేపీనే

కేంద్రంలో, తెలంగాణలో వచ్చేది బీజేపీనే


కేసీఆర్ తో ఉద్యమంలో పాల్గొన్నందుకు లెంపలేసుకుంటున్నానని బీజేపీ సీనియర్ లీడర్ విజయశాంతి అన్నారు. 4వ విడత బీజేపీ బహిరంగ సభ కుత్భుల్లాపూర్ లో జ‌రిగింది.  ఈ  సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వ‌చ్చేది బీజేపీయేనని స్పష్టం చేశారు. ఈ  సభలో సీఎం కేసీఆర్ పై ఆమె తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా చెత్తమయమేనని, కేసీఆర్ వచ్చాక హైదరాబాద్ ను సర్వనాశనం చేశాడంటూ కామెంట్స్ చేశారు.  

వర్షాలు వస్తే మలేరియా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని, దోమల మందు కొట్టడం లేదన్నారు. రోడ్లు, డ్రైనేజీ, నాలల పరిస్థితి అయితే మరింత అద్వాన్నంగా ఉందని తెలిపారు. కేసీఆర్ పాలన అతినీచంగా ఉందని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి,  ఖజానాను కేసీఆర్ దోచుకుంటున్నాడంటూ విజయశాంతి ఆరోపించారు. కేసీఆర్ ఆరోగ్యశ్రీ కి బకాయిలు చెల్లించని కారణంగా పేదలు వైద్యానికి దూరం అవుతున్నారని .. మోడీ తెచ్చిన ఆయుష్మాన్ భారత్ ను కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేయడం లేదని వెల్లడించారు.

రాష్ట్రంలో రైతులను ఆదుకోని కేసీఆర్, పక్క రాష్ట్రాలలో రైతులకు తెలంగాణ సొమ్మును పంచుతున్నారని విమర్శించారు. ఎంఐఎంతో కలిసి కేసీఆర్ హిందూ సమాజాన్ని తిట్టిస్తున్నాడన్నారు. ప్రధాని పదవి విషయంలో కేసీఆర్, ఇతర నేతలవి పగటి కలలేనన్న ఆమె.. ఎన్ని కుయుక్తులు పన్నినా మోడీని ఏమీ చేయలేరని స్పష్టం చేశారు.