ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో గురువారం విజిలెన్స్ ఆఫీసర్లు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక్కడ కొంతకాలంగా అక్రమ రిజిస్ట్రేషన్లు, నకిలీ డాక్యుమెంట్ల తయారీ, డబుల్ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని, కొందరు ఆఫీసర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుమ్మక్కై డాక్యుమెంటరీ రైటర్లతో కలిసి అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో కరీంనగర్ యూనిట్కు చెందిన ఐదుగురు విజిలెన్స్ ఆఫీసర్లు ఆదిలాబాద్ సబ్రిజిస్ట్రేషన్ ఆఫీస్ను తనిఖీ చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. డాక్యుమెంట్ రైటర్లు, సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అధికారుల మధ్య డిజిటల్ లావాదేవీలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టిన విజిలెన్స్ ఆఫీసర్లు.. ఆరుగురు డాక్యుమెంట్ రైటర్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి యూపీఐ ట్రాన్జాక్షన్లను పరిశీలించారు. అలాగే సబ్ రిజిస్ట్రార్ విజయ కాంతారావు యూపీఐ లావాదేవీలను సైతం పరిశీలించారు.
ఆయనకు యూపీఐ ద్వారా కమిషన్లు వచ్చాయని ఆఫీసర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని పలు సర్వే నంబర్లలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్లకు కమిషన్లు తీసుకుంటున్నారని విమర్శలు వస్తున్న నేపథ్యంలో విజిలెన్స్ దాడులు జరగడం కలకలం రేపింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు చేసిన ఆఫీసర్లు రిపోర్ట్ను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు చెప్పారు. విచారణ కోసం సబ్ రిజిస్ట్రార్ విజయకాంతారావును కరీంనగర్ యూనిట్కు రావాలని సూచించారు.

