
వికారాబాద్, వెలుగు : వికారాబాద్ జిల్లాలో జడ్పీ చైర్పర్సన్ సునీతా రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరిది. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అంగీలు చింపుకొని.. కొట్టుకున్నారు. ఈ ఘటనలో సునీతా రెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. మర్పల్లిలో సాయిబాబా టెంపుల్ దగ్గర జరుగుతున్న గురు పౌర్ణమి ఉత్సవాలకు జడ్జీ చైర్పర్సన్ సునీతా రెడ్డి వచ్చారు. ఎమ్మెల్యే ఆనంద్ వర్గీయులు ఆమె కారును అడ్డుకుని రాళ్ల దాడికి దిగారు. దీంతో సునీతా రెడ్డి వర్గం అడ్డుకుని.. ఆమెను సురక్షితంగా పూజా కార్యక్రమాలకు తీసుకెళ్లింది. మహేందర్ రెడ్డి డౌన్.. డౌన్.., సునీతా రెడ్డి గో బ్యాక్ అంటూ 30 మంది కార్యకర్తలు నిరసన తెలిపారు. మర్పల్లి గడ్డ.. ఎమ్మెల్యే ఆనంద్ అడ్డా.. అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ఆనంద్ను అవమానించేలా ప్రవర్తిస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు. జడ్పీ చైర్పర్సన్గా ఉంటూ ప్రొటోకాల్ పాటించడం లేదన్నారు. సునీతా రెడ్డి కారుపై బండ రాయి వేయడంతో వెనుక గ్లాస్ పగిలిపోయింది. దాడికి పాల్పడిన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డికి జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఫిర్యాదు చేశారు.