ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతంగా గ్రామ పాలన అధికారుల ఎగ్జామ్

ఉమ్మడి పాలమూరు జిల్లాలో  ప్రశాంతంగా గ్రామ పాలన అధికారుల ఎగ్జామ్

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించనున్న  గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్​నగర్​లోని చైతన్య హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని  కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. 152 మందికి గాను, 140 మంది అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టర్  తెలిపారు. కలెక్టర్​ వెంట అడిషనల్​ కలెక్టర్  మోహన్ రావు, ఆర్డీవో నవీన్, చీఫ్  సూపరింటెండెంట్  మహమ్మద్  అహ్మద్   ఉన్నారు.

నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్ లోని జడ్పీ బాయ్స్​ హైస్కూల్​లో  ఏర్పాటు చేసిన ఎగ్జామ్​ సెంటర్​ను కలెక్టర్  బదావత్​ సంతోష్​ సందర్శించారు. 119 పరీక్ష రాయాల్సి ఉండగా, 112 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.

వనపర్తి: వనపర్తిలోని జడ్పీ బాయ్స్​ హైస్కూల్​లో ఆదివారం జరిగిన పరీక్షకు 97 మందికి గాను, 90 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సెంటర్​ను కలెక్టర్​ ఆదర్శ్​ సురభి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.  జవాబు పత్రాలను స్పెషల్  మెసెంజర్  ద్వారా ఎస్కార్ట్ తో హైదరాబాద్  జేఎన్టీయూకు పంపిస్తామని తెలిపారు. నోడల్  ఆఫీసర్​ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్  నోడల్  ఆఫీసర్​ సుబ్రహ్మణ్యం, చీఫ్  సూపరింటెండెంట్  గురురాజ్, తహసీల్దార్  రమేశ్ రెడ్డి, ఆర్ఐ మధు, అబ్జర్వర్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

గద్వాల: గద్వాల బాయ్స్  హైస్కూల్ లో నిర్వహించిన పరీక్షకు 81 మందికి గాను, 77 మంది హాజరైనట్లు అడిషనల్  కలెక్టర్  లక్ష్మీనారాయణ తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్  మల్లికార్జున్, పరీక్ష నిర్వాహకుడు ఇమ్మానుయేల్  పాల్గొన్నారు.

నారాయణపేట: నారాయణపేటలోని ఎస్వీఎస్  జూనియర్  కాలేజీలో గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 111 మంది అభ్యర్థులకు గాను,102 మంది పరీక్షకు హాజరైనట్లు అడిషనల్  కలెక్టర్  సంచిత్  గంగ్వార్  తెలిపారు. ఎగ్జామ్  సెంటర్​ను పరిశీలించి సూచనలు చేశారు.