
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియమించనున్న గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. మహబూబ్నగర్లోని చైతన్య హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ విజయేందిర బోయి తనిఖీ చేశారు. 152 మందికి గాను, 140 మంది అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ మోహన్ రావు, ఆర్డీవో నవీన్, చీఫ్ సూపరింటెండెంట్ మహమ్మద్ అహ్మద్ ఉన్నారు.
నాగర్ కర్నూల్ టౌన్: నాగర్ కర్నూల్ లోని జడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎగ్జామ్ సెంటర్ను కలెక్టర్ బదావత్ సంతోష్ సందర్శించారు. 119 పరీక్ష రాయాల్సి ఉండగా, 112 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు.
వనపర్తి: వనపర్తిలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్లో ఆదివారం జరిగిన పరీక్షకు 97 మందికి గాను, 90 మంది అభ్యర్థులు హాజరయ్యారు. సెంటర్ను కలెక్టర్ ఆదర్శ్ సురభి సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జవాబు పత్రాలను స్పెషల్ మెసెంజర్ ద్వారా ఎస్కార్ట్ తో హైదరాబాద్ జేఎన్టీయూకు పంపిస్తామని తెలిపారు. నోడల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ నోడల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం, చీఫ్ సూపరింటెండెంట్ గురురాజ్, తహసీల్దార్ రమేశ్ రెడ్డి, ఆర్ఐ మధు, అబ్జర్వర్ సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.
గద్వాల: గద్వాల బాయ్స్ హైస్కూల్ లో నిర్వహించిన పరీక్షకు 81 మందికి గాను, 77 మంది హాజరైనట్లు అడిషనల్ కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తహసీల్దార్ మల్లికార్జున్, పరీక్ష నిర్వాహకుడు ఇమ్మానుయేల్ పాల్గొన్నారు.
నారాయణపేట: నారాయణపేటలోని ఎస్వీఎస్ జూనియర్ కాలేజీలో గ్రామ పాలన అధికారుల ఎంపిక పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 111 మంది అభ్యర్థులకు గాను,102 మంది పరీక్షకు హాజరైనట్లు అడిషనల్ కలెక్టర్ సంచిత్ గంగ్వార్ తెలిపారు. ఎగ్జామ్ సెంటర్ను పరిశీలించి సూచనలు చేశారు.