లీడర్లంతా కలసి ల్యాండ్ కొనియ్యండి

లీడర్లంతా కలసి ల్యాండ్ కొనియ్యండి

నెల్లికుదురు, వెలుగు: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లిలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను గ్రామస్థులు నిలదీశారు. శుక్రవారం గ్రామంలో ప్లే గ్రౌండ్​ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన గ్రామస్థులు ఆ స్థలాన్ని గతంలో దళితులకు ఇచ్చారని, ప్లే గ్రౌండ్​కు తమ భూములు ఇయ్యబోమని తేల్చి చెప్పారు. గ్రామానికి ఏ పథకం వచ్చినా లీడర్లే ముందుగా తీసుకుంటున్నారని, క్రీడా మైదానానికి కూడా ల్యాండ్ వాళ్లే కొనియ్యాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు తమ గ్రామానికి దళితబంధు ఎట్లా ఉంటదో కూడా తెల్వదన్నారు. దళితబంధు లిస్టులో ఎవరి పేర్లు ఉన్నాయో చెప్పాలన్నారు. దళితబంధు రానోళ్లకు జాగ ఇస్తామని, లొల్లి పెట్టుకోవద్దని ఎమ్మెల్యే అన్నారు. దీంతో అక్కడున్నవాళ్లంతా మీరిచ్చిన పథకాలు మా వరకు రావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్థుల ఆందోళనతో ఎమ్మెల్యే అక్కడినుంచి వెళ్లిపోయారు.