స్వతంత్ర పిపాసి  వీర సావర్కర్​

స్వతంత్ర పిపాసి  వీర సావర్కర్​


స్వా తంత్ర్య వీర సావర్కర్ జీవనం ప్రతి యువకుడి హృదయాన్ని ఉర్రూతలూగిస్తుంది. రెండు జీవితఖైదు శిక్షలు, జైల్లో అంతులేని యాతనలు అనుభవించిన గొప్ప దేశభక్తుడు.  స్వాతంత్ర్య సాధన కోసం జీవిత కాలమంతా  వందలాది యువకులను  నిర్మాణం చేసిన ఆదర్శ స్వాతంత్ర్య వీరుడు సావర్కర్. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా బాగూర్ గ్రామంలో దామోదర్ పంత్ సావర్కర్,- రాధాబాయి అనే దంపతులకు వినాయక దామోదర్ సావర్కర్ జన్మించారు. 

విద్యాభ్యాసం

నాసిక్​లో విద్యాభ్యాసం చేశారు. బారిష్టర్​ చదువు కోసం లండన్​ వెళ్లారు.  స్వతంత్ర భావనను రగిలించడం కోసం సావర్కర్ 1857 లో జరిగిన స్వతంత్ర సంగ్రామ చరిత్రను పూర్తి వివరాలతో రాశారు.  దీన్ని భారత్​లో ఉన్న తన అన్న గణేశ్​ సావర్కర్​ద్వారా అందరికీ  ప్రథమ స్వాతంత్ర్య పోరాటాన్ని  ప్రజలకు తెలిసేలా చేశారు. అయితే సావర్కార్ పుస్తకం ఆ సంగ్రామం యొక్క నిజస్వరూపం అందరికీ అర్థమయ్యేటట్లు చేసింది.   ఈ విషయం ప్రభుత్వానికి తెలిసింది.  ప్రభుత్వం వెంటనే ఆ పుస్తకం పైన నిషేధాజ్ఞలు జారీ చేసింది.  గణేష్ సావర్కర్​ను రాజ ద్రోహిగా  కోర్టు  నిర్ణయించి జీవిత ఖైదు విధించింది. 

రెండు ఆజన్మ కారాగార శిక్షలు

   
భారతదేశంలో సావర్కర్ పైన న్యాయ విచారణ జరిగింది. ఆయనపై రెండు నేరారోపణలు చేశారు. రెండు ఆజన్మ కారాగార శిక్షలు విధించారు. సావర్కర్ ఆస్తినంతటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. రెండు కారాగార శిక్షలంటే అండమాన్ కాలాపాని జైలులో మొత్తం 50 సంవత్సరాల కఠిన శిక్షలు భరించడం అన్నమాట. అండమాన్ జైలు అంటే దుర్భరయాతనలు, బాధలు మొదలైన కఠిన శిక్షలకు ప్రసిద్ధి. ఇరుకైన గది గోడల మధ్య చీకటి గదిలో బ్రతకాల్సి వచ్చేది. సావర్కర్ అనారోగ్యం గురించి విన్న భారత ప్రజానీకం ఆందోళన చెందింది. ఆయనను విడుదల చేయాలని దేశం నలుమూలల నుండి ప్రభుత్వంపై ఒత్తిడి రాసాగింది . ప్రభుత్వం చివరికి తలొగ్గాల్సి వచ్చింది. ఫలితంగా  అన్నదమ్ములు ఇద్దరినీ అండమాన్ నుంచి  కొంతకాలం పాటు  కలకత్తా జైల్లో ఉంచారు. 1922లో వీరసావర్కర్ ని కూడా విడుదల చేశారు.1937 వరకు రత్నగిరి జిల్లాలో గృహనిర్బంధంలోనే మగ్గారు. 

హిందూ మహాసభ

1938లో సావర్కర్ పైన ఉన్న రెండు ఆంక్షలు తొలిగి పోయాయి. సావర్కర్ రాజకీయ రంగంలోకి ప్రవేశించారు . హిందూ మహా సభకు అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.  భారత్ నుంచి వేరు కావాలని పాకిస్తాన్ కోరికను ఆయన తీవ్రంగా ఖండించారు.  లక్షలాదిమంది హిందువులు పాకిస్తాన్​లో ఊచకోత కోయబడ్డారు. 1948లో గాంధీజీ హత్య చేయబడ్డారు. భారత్ ప్రభుత్వం సావర్కర్ ని బంధించి న్యాయ విచారణ చేయించింది. న్యాయ విచారణలో నిర్దోషిగా నిష్కళంకుడైన  వ్యక్తిగా నిరూపించబడ్డారు. సావర్కర్ జీవితమంతా సంఘర్షణ మయమైనది. వారు ఎన్ని కష్టాలు అనుభవించినా వాటి పరిణామం స్వాతంత్ర్యమే.

సాహసోపేతమైన ఎత్తు

వినాయక్​ సావర్కర్​ లండన్ లో బారిష్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యాడు. భారత దేశం వెళ్లడానికి విక్టోరియా స్టేషన్ చేరుకున్న సావర్కర్​ ను  ప్రభుత్వం స్టేషన్లోనే  నిర్బంధించింది. అతనిపై రాజ ద్రోహ నేరం, ఆంగ్లేయ అధికారుల హత్య నేరాలను  ఆరోపించారు. సావర్కర్​ను  బందీగా పట్టుకొని మోరియా అనే ఓడలో భారత్ కు పంపించారు.1910 జులై 10వ తేదిన మోరియా ఓడలో బందీగా భారత్ వస్తున్న సమయంలో ఫ్రాన్స్​లోని మార్సెల్స్ రేవు పట్నంలో ఓడ లంగరు వేసి నిలబడింది. అదే సమయంలో నేను బయటికి వెళ్ళాలి అని  తనను కాపలా కాస్తున్న రక్షక భటులను అడిగాడు. ఒక రక్షక భటుడు అతన్ని మరుగుదొడ్డి దగ్గరకు తీసుకువెళ్లాడు. బందీ లోనికి వెళ్లి తలుపు వేసుకున్నాడు.  మరుగుదొడ్డిలోని రంధ్రం గుండా సముద్రంలోకి జారిపోయాడు. ఆయన ఈదుకుంటూ ఫ్రాన్స్ భూభాగం మీద అడుగుమోపాడు.  అంతలోనే గస్తీ నావలో అక్కడ సిద్ధంగా ఉన్న బ్రిటిష్ పోలీసులు సావర్కర్​ను తిరిగి నిర్బంధంలోకి తీసుకున్నారు. సావార్కర్​ను బంధించి భారతదేశానికి చేర్చారు.

బంటు జనార్దన్