- ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర విభజన చట్టంలో హామీ ఇచ్చిన కాజీపేట రైల్వే కోచ్ఫ్యాక్టరీపై స్పష్టమైన ప్రకటన చేసిన తర్వాతే ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రావాలని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. జులై 8న మోదీ వరంగల్కు వస్తున్న నేపథ్యంలో వినోద్ గురువారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మీడియాతో మాట్లాడారు. వరంగల్ఉమ్మడి జిల్లా ప్రజలు నాలుగు దశాబ్దాలుగా కోచ్ఫ్యాక్టరీ కోసం ఎదురు చూస్తున్నారని, కానీ మోదీ కేవలం వ్యాగన్లు రిపేరు చేసే సెంటర్ ను ప్రారంభించేందుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. కేంద్రంలో రైల్వే శాఖ మంత్రిగా ఎవరుంటే వారి రాష్ట్రాల్లో కోచ్ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసుకుంటున్నారని, ‘ఇదేనా జాతీయ సమైక్యతా స్ఫూర్తి’ అని ఆయన ప్రశ్నించారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో కొత్తగా రైల్వే కోచ్ఫ్యాక్టరీలు ఇవ్వడం లేదని ప్రకటించిందని, కానీ 2018లో లాథూరులో, 2022లో దాహాల్లో కోచ్ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతులతో పాటు నిధులిచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణకు విభజన చట్టం ప్రకారం హక్కు ఉన్న కోచ్ఫ్యాక్టరీ ఇవ్వని కేంద్రం ఇతర రాష్ట్రాలకు వాటిని మంజూరు చేయడం న్యాయం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కోచ్ ఫ్యాక్టరీపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని వినోద్కుమార్ డిమాండ్ చేశారు.