
మెల్బోర్న్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ… వరల్డ్ క్రికెట్లో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అని ఆస్ట్రేలియా మాజీ సారథి మార్క్ టేలర్ అన్నాడు. అగ్రెసివ్ క్రికెట్ ఆడటంతో పాటు గొప్ప స్టేట్స్మన్గా కూడా వ్యవహరిస్తాడని ప్రశంసలు కురిపించాడు. ‘క్రికెట్ వరల్డ్లో కోహ్లీ అత్యంత బలమైన వ్యక్తి. ఒకేసారి దూకుడుతనాన్ని, రాజనీతిజ్ఞతను గొప్పగా ప్రదర్శిస్తాడు. అతనిలా వ్యవహరించడం ఇప్పుడున్న క్రికెటర్లకు సాధ్యం కాదు. ఇతరులపై ప్రభావం చూపే వ్యక్తిత్వాన్ని అతను ఎంతో గౌరవంగా, బాధ్యతగా ఫీలవుతాడు. విరాట్ ఆటను చూస్తుంటే మనవాడే అన్న అభిమానం కలుగుతుంది. చాలాసార్లు అతనితో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని గ్రహించా. ఆటపట్ల అంకితభావం కూడా ఎక్కువే’ అని టేలర్ పేర్కొన్నాడు. కాగా, తన ఒపీనియన్స్ను ఎక్స్ప్రెస్ చేయడానికి కోహ్లీ ఎప్పుడు భయపడడని టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. వరల్డ్ క్రికెట్లో విరాట్ అత్యంత ప్రభావవంతమైన ప్లేయర్ అని కితాబిచ్చాడు. ‘కోహ్లీ వ్యూస్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. వాటి గురించి మాట్లాడటానికి ఎప్పుడూ భయపడడు. చాలా డేర్గా తన అభిప్రాయాలను చెప్పేస్తాడు. టెస్ట్ క్రికెట్ అంటే విరాట్కు చాలా ఇష్టం. చాలా రెస్పెక్ట్తో గేమ్ ఆడతాడు. ఎందుకంటే ఇండియన్ క్రికెట్కు అతనో పెద్ద ఐకాన్. ఇండియాకు కెప్టెన్లుగా చేసిన కొంత మందికి టెస్ట్లంటే నచ్చవు. కానీ విరాట్ బాగా ఇష్టపడతాడు. ఈ ఫార్మాట్లో అతను ఓ చాంపియన్. అందుకే ఇండియా చాలా బాగా టెస్ట్ క్రికెట్ ఆడుతున్నది’ అని చాపెల్ వ్యాఖ్యానించాడు.