ఆందోళన లేదన్న మేనేజ్మెంట్
సౌతాంప్టన్: వరల్డ్కప్లో టీమిండియా ఇంకా తొలి మ్యాచ్ ఆడకముందే అభిమానులను కలవరపెట్టే వార్త ఒకటి కలకలం రేపింది. సౌతాంప్టన్లో శనివారం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ గాయపడ్డాడు. కోహ్లీ బొటనవేలికి దెబ్బ తగలడంతో ఫిజియో పాట్రిక్ ఫర్హాత్ గాయంపై మ్యాజిక్ స్ప్రే చేసి టేప్ వేశాడు. ఆ తర్వాత ఐస్ ముక్కలున్న గ్లాస్లో వేలు పెట్టుకుని విరాట్ నెట్స్ను వీడాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు బయటికిరావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే నెట్స్లో బ్యాటింగ్ చేస్తుండగా కోహ్లీ బొటనవేలికి చిన్న గాయమైందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జట్టు వర్గాలు తెలిపాయి.
నా బౌలింగ్ను ఎవరూ సీరియస్ తీసుకోరు: కోహ్లీ
తన బౌలింగ్పై టీమిండియా సభ్యులెవరికీ నమ్మకం లేదని కోహ్లీ చమత్కరించాడు. తాను అకాడమీలో ఉండే రోజుల్లో జేమ్స్ అండర్సన్ (ఇంగ్లండ్) బౌలింగ్ యాక్షన్ను ఫాలో అయ్యేవాడినని తెలిపాడు. ఇంగ్లండ్తో మ్యాచ్ జరిగినప్పుడు తనకు ఈ విషయాన్ని చెప్పానని, అనంతరం ఇరువురు దీనిపై జోకులు వేసుకున్నట్లు తెలిపాడు. చివరిసారిగా 2017లో శ్రీలంకపై కోహ్లీ బౌలింగ్ చేశాడు.
నెట్స్లో శ్రమిస్తున్న కేదార్..
భుజం గాయం నుంచి కోలుకున్న టీమిండియా ప్లేయర్ కేదార్ జాదవ్ నెట్స్లో తీవ్రంగా సాధన చేశాడు. ప్రాక్టీస్ సెషన్లో తను అలవోకగా బ్యాటింగ్తోపాటు బౌలింగ్ కూడా చేస్తుండడంతో టీమ్ మేనేజ్మెంట్ ఆనందం వ్యక్తం చేస్తోంది. అయితే ఈనెల 5 న సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్లో అతను బరిలోకి దిగడంపై స్పష్టత లేదు. ఐపీఎల్లో గాయపడిన కేదార్.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్తో జరిగిన వామప్మ్యాచ్ల్లోనూ బరిలో దిగని సంగతి తెలిసిందే.