అమెరికాకు చెందిన ప్రముఖ గ్లోబల్ పేమెంట్ కార్డ్ దిగ్గజం ‘వీసా’ (Visa) ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగులలో 7 శాతాన్ని, అంటే సుమారు 2,600 మందిని తొలగించనున్నట్లు మంగళవారం వెల్లడించింది. చెల్లింపుల (Payments) రంగంలో పెరుగుతున్న తీవ్రమైన పోటీని తట్టుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వీసా సీఈఓ ర్యాన్ మెక్ఇనెర్నీ తెలిపారు.
ఉద్యోగులకు సీఈఓ మెమో
ఈ ఉద్యోగ కోతలపై సిబ్బందికి పంపిన మెమోలో సీఈఓ మాట్లాడుతూ.. "కంపెనీలో పనితీరును మరింత మెరుగుపరచుకోవడానికి, భవిష్యత్ అవకాశాలపై దృష్టి పెట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నాం. మా క్లయింట్లు, పార్ట్నర్లకు ఇది సరైనదేనన్న పూర్తి నమ్మకం నాకుంది" అని పేర్కొన్నారు. అయితే, ఫిన్టెక్ రంగంలోని ఇతర సంస్థలైన పేపాల్, బ్లాక్ వంటి కంపెనీలతో పోలిస్తే వీసాలో కోతలు తక్కువేనని చెప్పవచ్చు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రభావం
ఈ ఉద్యోగాల తొలగింపునకు ఏఐ (AI) టెక్నాలజీ వాడకం కూడా ఒక కారణమని సీఈఓ తెలిపారు. పనులను వేగవంతం చేయడానికి, పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేయడానికి ఏఐ ఎంతగానో సహకరిస్తోందని, అయితే కేవలం ఏఐ వల్లే ఉద్యోగాలు తీయడం లేదని నివేదిక స్పష్టం చేసింది.
ఎందులో పెట్టుబడులు పెడుతున్నారు?
ఉద్యోగాల ద్వారా ఆదా అయిన వనరులను.. కస్టమర్ల పేమెంట్స్, స్టేబుల్కాయిన్, సరిహద్దులు దాటి చేసే చెల్లింపులు, బిజినెస్-టూ-బిజినెస్ (B2B) సేవలు వంటి ఆధునిక విలువ ఆధారిత సేవల్లో తిరిగి పెట్టుబడి పెట్టాలని వీసా యోచిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మేము తీసుకున్న సరైన నిర్ణయాల వల్లే వ్యాపారంలో మంచి ఊపుమీద ఉన్నామని, భవిష్యత్తులోనూ అద్భుతమైన సేవలను అందిస్తామని సీఈఓ ధీమా వ్యక్తం చేశారు.
