హైదరాబాద్, వెలుగు: తక్కువ ధరల్లో పర్యావరణ అనుకూల బిల్డింగ్ మెటీరియల్స్ తయారు చేసే హైదరాబాద్ కంపెనీ విశాక ఇండస్ట్రీస్ ఈ ఏడాది మార్చితో ముగిసిన 2022 ఫైనాన్షియల్ ఇయర్లో రూ.118.53 కోట్ల లాభం సాధించింది. అంతకుముందు ఫైనాన్షియల్ ఇయర్ లాభం రూ.110.65 కోట్లతో పోలిస్తే ఇది 10 శాతం ఎక్కువ. రెవెన్యూ రూ.1,146 కోట్ల నుంచి రూ.1,415.78 కోట్లకు, ఇబిటా రూ.202.06 కోట్ల నుంచి రూ.209.94 కోట్లకు పెరిగింది. ఇబిటా మార్జిన్ 15 శాతం నుంచి 18 శాతానికి, పీఏటీ మార్జిన్ 8 శాతం నుంచి 10 శాతానికి పెరిగింది.
క్యూ4లో రూ.421 కోట్ల ఆదాయం
ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో కంపెనీకి రూ.30.12 కోట్ల లాభం వచ్చింది. 2021 మార్చి క్వార్టర్లో రూ.30.88 కోట్ల లాభం వచ్చింది. ఇదే కాలంలో ఆదాయం రూ.354.15 కోట్ల నుంచి రూ.420.63 కోట్లకు పెరిగింది. ఇబిటా 55.23 కోట్ల నుంచి రూ.55.21 కోట్లకు తగ్గింది. ఇబిటా మార్జిన్ 16 శాతం నుంచి 13 శాతానికి తగ్గింది. ఫలితాలపై విశాక జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీ గడ్డం మాట్లాడుతూ ‘‘మా టీమ్ కమిట్మెంట్తో కష్టపడి పనిచేయడం వల్ల నాలుగో క్వార్టర్లో ఫలితాలు బాగా వచ్చాయి. దేశవిదేశాల్లో చాలా ప్రాజెక్టులు మొదలుపెట్టాం. కరోనా ఇబ్బందులను అధిగమించాం. మా ప్రొడక్టులకు డిమాండ్ పెరిగింది. యూపీలోని రాయ్బరేలీలో కొత్త అస్బెస్టాస్సిమెంట్ డివిజన్ను మొదలుపెట్టాం. లక్ష ఎంటీపీఏ కెపాసిటీ గల అదనపు లైన్ కూడా మొదలైంది. తమిళనాడులోని ఉడుమాళ్పేటలో వీబోర్డ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను స్టార్ట్ చేశాం. జనవరి నుంచే ఇక్కడ ప్రొడక్షన్ మొదలయింది. పర్యావరణ అనుకూల బిల్డింగ్ మెటీరియల్స్కు దేశమంతటా మంచి గిరాకీ ఉంది”అని ఆయన వివరించారు.