- బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఈ నెల 15లోగా చెల్లించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ విశారదన్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో రెండు వేలకుపైగా ఉన్న ఇంజినీరింగ్, ఫార్మసీ మేనేజ్మెంట్, లా తదితర వృత్తి విద్యా కాలేజీలతోపాటు డిగ్రీ, పీజీ కాలేజీల్లో 20 లక్షల మందిదాకా చదువుతున్నారని గుర్తుచేశారు.
వాటిలో చదువుతున్న 90 శాతం మంది విద్యార్థులు పేద, బలహీన వర్గాలకు చెందినవాళ్లేనని తెలిపారు. వాళ్లంతా ప్రభుత్వం అందించే ఫీజు రీయింబర్స్మెంట్పై ఆధారపడి చదువుతున్నవాళ్లేనని పేర్కొన్నారు. ప్రభుత్వం నాలుగేండ్ల నుంచి ఫీజు రీయింబర్స్ చేయకపోవడంతో కాలేజీ మేనేజ్మెంట్లు బంద్ పాటిస్తున్నాయని, దాంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
