చెన్నై: ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఆన్లైన్ చెస్ ఈవెంట్కు రంగం సిద్ధమైంది. కరోనా కారణంగా స్పోర్ట్స్ క్యాలెండర్ పూర్తిగా దెబ్బతిన్న సమయంలో టెక్నాలజీ సాయంతో చెస్, షూటింగ్ లాంటి పోటీలు జరుగుతున్నాయి. ప్లేయర్లు తమ ఇంట్లోనే ఉంటూ వివిధ దేశాల్లోని ప్రత్యర్థులతో పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో మంగళవారం మొదలయ్యే ఆన్లైన్ నేషన్స్ కప్ చెస్ టోర్నమెంట్లో ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ సారథ్యంలోని ఇండియా ఐదో సీడ్గా బరిలోకి దిగనుంది. వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్సన్ మినహా ప్రపంచంలోని పలువురు బెస్ట్ ప్లేయర్లంతా ఇంటి నుంచే ప్రత్యర్థులకు చెక్ పెట్టనున్న ఈ టోర్నీలో ఆరు జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఫిడే, చెస్డాట్కామ్ ఆధ్వర్యంలో ఈ నెల పదో తేదీ వరకు జరిగే మెగా ఈవెంట్లో టాప్ సీడ్ చైనాతో పాటు యూరప్, రష్యా, యూఎస్ఏ, ఇండియా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ టీమ్స్ పోటీ పడనున్నాయి. ఆనంద్, పి. హరికృష్ణ, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, విదిత్ గుజరాతీ, బి.అధిబన్ బరిలో ఉన్న ఇండియా టీమ్కు మాజీ వరల్డ్ చాంప్ వ్లాదిమిర్ క్రామ్నిక్ అడ్వైజర్గా వ్యవహరిస్తాడు.
తొలి మ్యాచ్లో యూఎస్ఏతో ఇండియా పోటీ పడనుంది. ఇక, డింగ్ లిరెన్, వాంగ్ హవో, వెయ్ యి, హౌ యిఫన్, జు వెంజిన్ తదితరులతో చైనా ఫేవరెట్గా బరిలోకి దిగుతోంది. ఈ టీమ్కు యూరప్, యూఎస్ టీమ్స్ నుంచి సవాల్ ఎదురవనుంది. రష్యా లెజెండ్ గ్యారీ కాస్పరోవ్ యూరోపియన్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు. డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో ఓ జట్టు మిగతా ఐదు జట్లతో రెండేసి మ్యాచ్లు ఆడుతుంది. పది రౌండ్ల తర్వాత తొలి రెండు ప్లేస్ల్లో నిలిచే జట్ల మధ్య ‘సూపర్ఫైనల్’ జరుగుతుంది. ప్రతి మ్యాచ్లో నాలుగు బోర్డ్స్ ఉంటాయి. ముగ్గురు పురుషులు, ఒక మహిళా ప్లేయర్ పోటీ పడుతారు. 25 నిమిషాల ర్యాపిడ్ టైమ్ కంట్రోల్, ప్రతి ఎత్తుకు 10 సెకండ్ల టైమ్ ఇంక్రిమెంట్తో పోటీ నిర్వహిస్తారు. రూ. 1.36 కోట్ల (1,80,000 డాలర్లు) ప్రైజ్మనీ కలిగిన ఈ టోర్నీ ఫిడే, చెస్డాట్కామ్ చానెల్స్తో పాటు ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వివిధ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. టోర్నీ విజేతకు 36.30 లక్షల ప్రైజ్మనీ అందుతుంది. రన్నరప్కు రూ. 27 లక్షలు ఇస్తారు. మిగతా నాలుగు జట్లు పార్టిసిపేషన్ ప్రైజ్మనీగా తలో రూ. 18 లక్షలు నగదు అందుకుంటాయి.