తప్పుడు కేసులు పెట్టిస్తున్న బాల్క సుమన్ను చిత్తుగా ఓడించాలె : జీ. వివేక్

తప్పుడు కేసులు పెట్టిస్తున్న బాల్క సుమన్ను చిత్తుగా ఓడించాలె : జీ. వివేక్

చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధి కోసం పని చేయాలని బాల్క సుమన్ ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపిస్తే .. ఆయన మాత్రం ప్రగతి భవన్ లో పని చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీ. వివేక్ వెంకటస్వామి. జైపూర్ మండలంలో చాలా మంది కాంగ్రెస్ నాయకులపై బాల్క సుమన్ తప్పుడు కేసులు పెట్టించారని చెప్పారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెడుతున్న బాల్క సుమన్ ను రానున్న ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

ఓటుకు ఐదు వేల రూపాయల వరకు బాల్క సుమన్ ఖర్చు పెడుతున్నారని చెప్పారు. బాల్క సుమన్ ఇస్తున్న డబ్బును తీసుకోవడం తప్పు లేదని.. హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. జైపూర్ పవర్ ప్లాంట్ లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం జైపూర్ పవర్ ప్లాంట్ లో స్థానికులు ఉద్యోగాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు.

మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని శెట్ పల్లి, జైపూర్ లో నిర్వహించిన ప్రచారంలో వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. ప్రస్తుతం చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రచారం జోరుగా కొనసాగుతోంది. జీ. వివేక్ వెంకటస్వామి అన్ని గ్రామాల్లోనూ ప్రచారం చేస్తున్నారు. ప్రతి గ్రామంలోనూ ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వివేక్ వెంట నడుస్తూ.. హుషారుగా ప్రచారం చేస్తున్నారు.